
జీడీనెల్లూరులోని ఓ ఫ్యాక్టరీ వద్ద టోకన్ల కోసం గుమికూడిన జనం
గిట్టుబాటు కాని ధర
పలుచోట్ల కిలో రూ.4
కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం రూ.5, రూ.6 ఇస్తున్న వైనం
ఆరు నెలల తర్వాతే నగదు చెల్లింపు
టోకన్ల కోసం అవస్థలు
చోద్యం చూస్తున్న అధికారులు
కాణిపాకం: తోతాపురి మామిడి రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాయల విక్రయానికి అవసరమైన టోకెన్ల కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు అధికారుల ఒత్తిడిమీద కొనుగోలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మామిడి వ్యాపారులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో రూ.4 అని పాట పాడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే నగదు చెల్లింపులు ఆరు నెలల తర్వాతేనని తేల్చిచెబుతున్నాయి.
దిగుబడి అధికమే కారణమా?
చిత్తూరు జిల్లాలో మామిడి సాగు 56 వేల హెక్టార్లలో విస్తరించింది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్ల వరకు ఉండగా.. ఈ సారి 49,9274 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంబరపడిపోయారు. తీరా ధరలు పతనమవడంతో డీలాపడ్డారు. టేబుల్ రకాల ధరలు కూడా ఈ సారి ఆశాజనకంగా లేవు.
తోతాపురి రూ.4
జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించేస్తున్నారు. తోతాపురి కేజీ రూ.4కే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వరుసగా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ తొలుత కేజీ రూ.5కే కొనుగోలు చేసింది. అధికారులు ఆ ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవడంతో రూ.6కు ఫిక్స్ చేసింది. మిగిలిన ఫ్యాక్టరీలన్నీ అదేబాట పట్టాయి. దీనికితోడు తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తోతాపురి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలు అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ కేజీ రూ.4కే కొనుగోలు చేసి రూ.5కు ఫ్యాక్టరీకి అన్లోడ్ చేస్తున్నాయి.
ఆరు నెలల తర్వాతే బిల్లులు
తమిళనాడు నుంచి దిగుమతవుతున్న కాయలకు మాత్రం ఫ్యాక్టరీలు అప్పటికప్పుడు నగదు చెల్లిస్తుండగా.. తెలిసిన వ్యాపారులకు వారం, నెల రోజుల వ్యవధిలో పేమెంట్ చేస్తామని చెబుతున్నాయి. జిల్లాలోని రైతులకు మాత్రం కాయలు తరలించిన ఆరు నెలల తర్వాతే బిల్లులు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి.
కూటమి వెన్నుపోటు
మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు గిట్టుబాటు ధర కల్పించిందని సంబరపడిపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఫ్యాక్టరీలు కచ్చితంగా కొనాల్సిందేనని ఊదరగొట్టారు. కొనలేదంటే చర్యలతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. అది కూడా కేజీ రూ.8కే కొనాలని, ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తుందని సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే వారంలోనే గిట్టుబాటు ధర ఫల్టీ కొట్టింది. ప్రస్తుతం రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తున్నారు.
సిఫార్సులకే టోకన్లు
తోతాపురి విక్రయానికి మామిడి రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. టోకన్ల కోసం ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టోకన్ కోసం నిరీక్షిస్తున్నారు. టోకన్లు జారీచేసే సమయానికి నీకా..నాకా అంటూ పోటీపడుతున్నారు. కొన్ని టోకన్లు మాత్రమే రైతులకు ఇచ్చినట్టే ఇచ్చి..మిగిలిన టోకన్లు అన్నీ కూడా సిఫార్సుల మేరకు వెళ్లిపోతున్నాయి.
కూటమి నేతలు చెప్పిన వాళ్లకే టోకన్లను ఇచ్చుకుంటున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి ప్రాంతాల్లో ఈ రకమైన సమస్యలు అధికంగా ఉన్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం టోకన్ల కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరుపులు, కేకలతో దద్దరిలింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకుని తోతాపురి కేజీ రూ.8కే కొనుగోలు చేయించేయాల చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
దారుణం
ఇంత దారుణం ఎప్పుడూ లేదు. మామిడి పంట బాగా వచ్చిందని అనుకుంటే ధరలు లేవు. ఫ్యాక్టరీ కాడికి వస్తే కొనేవాళ్లు లేరు. టోకన్లు ఉంటేనే కొనుక్కుంటున్నారు. ఈబాధాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఏజూస్, ఆవలకొండ, జీడీనెల్లూరు
ఆరు నెలల తర్వాత బిల్లులా?
కాయలు అమ్ముకోవడానికి టోకన్ల కోసం వచ్చాం. టోకన్లు తీసుకోవ డానికి నానా పాట్లు పడుతున్నాం. టోకన్లు ఇవ్వడానికి ముందే ఆరు నె లల తర్వాతే డబ్బులు ఇస్తామంటున్నారు. తోతాపురి రూ.8 అన్నారు. ఇప్పుడు రూ.6 అంటున్నారు. – బాబునాయుడు, రంగాపురం, జీడీనెల్లూరు