గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే.
అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు.
తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.


