
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే బస్సుల ఉత్పత్తి
ఇదే విషయాన్ని 2021లోనే స్టాక్ ఎక్స్చేంజ్ లకు తెలిపిన సంస్థ
అయినా.. నిస్సిగ్గుగా తామే ప్రారంభించామని లోకేశ్ ప్రచారం..
సోషల్మీడియాలో విస్మయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
వాస్తవాన్ని విస్మరించి గత ప్రభుత్వ వేధింపులంటూ పచ్చముఠా విష ప్రచారం
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీది ఒకటే లక్ష్యం. ప్రత్యర్థులపై ఇష్టమొచ్చినట్లు అసత్యాలు వండివార్చడం, అడ్డగోలుగా వారిపై దు్రష్పచారం చేయడం. విజయవాడకు సమీపంలోని మల్లవల్లిలో అశోక్ లేలాండ్ యూనిట్ విషయంలోనూ ఆ పార్టీ, పచ్చమూకలు ఇదే పైత్యం ప్రదర్శిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన కంపెనీని తమ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందంటూ నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
నిజానికి.. 2018లో నిర్మాణం ప్రారంభించిన ఈ సంస్థ గత ప్రభుత్వ మద్దతుతో వేగంగా పనులు పూర్తిచేసుకుని కోవిడ్ ఉన్నా 2021లో ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే విషయాన్ని అశోక్ లేలాండ్ కంపెనీ ఫిబ్రవరి 19, 2021న స్టాక్ ఎక్సే్ఛంజీలకు కూడా సమాచారం ఇచ్చింది. ఇలా అప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన కంపెనీని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తిరిగి ప్రారంభించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు లేఖలు రాసిన జగన్ ప్రభుత్వం
వాస్తవానికి.. జీఎస్టీ, మార్కెట్ డిమాండ్ లేకపోవడం,కోవిడ్ సంక్షోభం తదితర కారణాలతో దేశీయ ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ప్రజారవాణా వ్యవస్థ దెబ్బతినడంతో పలు ఆటోమొబైల్ యూనిట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. అదే బాటలో అశోక్ లేలాండ్ కూడా ఉత్పత్తికి బ్రేక్ ఇచ్చింది. దీనిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అశోక్ లేలాండ్కు పలుమార్లు లేఖలు రాసింది. ఈ లేఖలతో పాటు ఇప్పుడిప్పుడే తిరిగి వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో అశోక్ లేలాండ్ ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించింది.

వాస్తవాలిలా ఉంటే.. అశోక్ లేలాండ్కు ఇస్తామన్న రాయితీలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆ సంస్థ ఉత్పత్తి ఆపేసిందంటూ టీడీపీ నాయకులతో పాటు మంత్రి భరత్ ఇటీవల చెప్పడంపై పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. యూనిట్ను ప్రారంభించేలా గత ప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి భిన్నంగా ఇలా విష ప్రచారం చేయడం తగదని, ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలపై వేధింపులుంటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా నాలుగేళ్లు మొదటి స్థానంలో ఎలా నిలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు ఎటువంటి ఆరోపణలు చేయనప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి అభాండాలు వేయడం తగదని పారిశ్రామిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.