‘అగ్ని’ అవినీతికి నాన్‌ క్యాడర్‌ ఆజ్యం | TDP Leader Payyavula Keshav new conspiracy | Sakshi
Sakshi News home page

‘అగ్ని’ అవినీతికి నాన్‌ క్యాడర్‌ ఆజ్యం

Jul 29 2025 4:17 AM | Updated on Jul 29 2025 4:17 AM

TDP Leader Payyavula Keshav new conspiracy

రూ.252కోట్ల కాంట్రాక్టు పనులను కొల్లగొట్టే పన్నాగం

అగ్ని మాపక శాఖ డీజీగా పోలీసే కాని నాన్‌ క్యాడర్‌ అధికారి 

మంత్రి పయ్యావుల కేశవ్‌ సమీప బంధువే మరి..

సాక్షి, అమరావతి: ‘మా దారి అడ్డదారి...అందుకు నాన్‌ క్యాడర్‌ అస్మదీయ అధికారే పాత్రధారి’ అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సమీప బంధువును హఠాత్తుగా తెరపైకి తెచ్చిది. రూ.252 కోట్ల టెండర్లకు తమ అనుయాయులకు కట్టబెట్టడమే లక్ష్యమని తేల్చిచెప్పింది. ఇప్పటికే తగిన గుర్తింపు, ప్రాధాన్యం లేదంటున్న డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) స్థాయి అధికారుల అసంతృప్తిపై ఆజ్యం పోసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పోలీసు శాఖకు సంబంధమే లేని పి.వెంకటరమణను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   

ఐపీఎస్‌ పోస్టులో నాన్‌ క్యాడర్‌ అధికారి... 
రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతా­ప్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకంటే కూ­డా ఆ పోస్టులో అసలు పోలీసు శాఖకు సంబంధమే లేని నాన్‌ క్యాడర్‌ అధికారి పి.వెంకట రమణ­ను ని­యమించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే అగ్ని మాపక శాఖ డీజీ పోస్టు ఐపీఎస్‌ అధికారుల­కు కేటాయించడం ఆనవాయితీ.  డీజీపీతో నిమి­త్తం లేకుండా నేరుగా హోమ్‌ శాఖ పరిధిలో విధులు ని­ర్వర్తించే ఆ పోస్టులో డీజీ స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌ అ­ధికారులను నియమిస్తారు. అయితే కేంద్ర ప్ర­భు­త్వ నిధులు రూ.252కోట్లు అగ్ని మాపక శాఖ ఆ«­దునికీకరణ టెండర్ల వ్యవహారం నేపథ్యంలో ప్ర­భు­త్వ పెద్దలు ఈ ఆనవాయితీకి తిలోదకాలు వదిలారు. 

మాదిరెడ్డి ప్రతిపాదన నచ్చకే బదిలీ వేటు  
భారీ పరిశ్రమలు వంటి వాటిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న నీటి ట్యాంకర్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో యూరోపియన్‌ దేశాల్లో అనుసరిస్తున్న కార్బన్‌ డైయాక్సైడ్‌ ట్యాంకర్లను కొనుగోలు చేయాలని మాదిరెడ్డి ప్రతాప్‌ ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వంలో కీలక మంత్రి సమ్మతించ లేదు. ఎందుకంటే ఆ టెండర్లను అడ్డగోలుగా తమ అనుయాయులకు కేటాయించేందుకు ఆ మంత్రి ఇప్పటికే డీల్‌ కుదుర్చుకున్నారు. ఆ కంపెనీలు నీటి ట్యాంకర్లనే సరఫరా చేయగలవు.

కార్బన్‌ డై  యాక్సైడ్‌ ట్యాంకర్లు కొనుగోలు చేయాలని నిర్ణయిస్తే తమ అనుయాయులకు టెండర్లు దక్కవు... తమకు భారీ కమీషన్లు రావనే ఆ మంత్రి అభ్యంతరం తెలిపారు. అంతేకాదు పరిశ్రమలు, వ్యాపార, విద్యా సంస్థలను తనిఖీల పేరుతో వేధించి భారీగా వసూళ్లకు పాల్పడేందుకు మాదిరెడ్డి ప్రతాప్‌ ససేమిరా అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేసి తమ అస్మదీయుడైన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆ మంత్రి భావించారు. ఇంతలో డీజీస్థాయి అధికారులు ప్రభుత్వంపై అసమ్మతి గళం ఎత్తడంతో మరో ఎత్తుగడ వేశారు. మాదిరెడ్డి ప్రతాప్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో అగ్ని మాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న పి.వెంకట రమణను పూర్తి అదనపు బాధ్యతలతో డీజీగా నియమించా­రు.

ఆయన ఐపీఎస్‌ అధికారి కాదు. నాన్‌ క్యాడర్‌ అ«­ది­­కారి. అయినా సరే ప్రభుత్వంలో కీలక నేత ఆయ­న్ని డీజీగా నియమించడం విస్మయపరిచింది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారిని నియమించాల్సిన ఆర్టీసీ ఎండీగా రిటైర్డ్‌ డీజీపీ ద్వారకా తిరుమలరావును నియమించారు. విజయవాడలోని ఆర్టీసీ డిపోకు చెందిన 4.50 ఎకరాలను లులు మాల్‌ గ్రూప్‌నకు అడ్డగోలుగా కేటాయించేందుకే ఆయనకు ఆ పోస్టులో నియమించారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ మరీ ఆ వ్యవహారాన్ని ద్వారకాతిరుమలరావు పూర్తి చేశారు.

ఇక విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీజీ నియామకంలోనూ ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదమైంది. డీజీపీ గుప్తానే విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించింది. అదే రీతిలో ప్రస్తుతం అగ్ని మాపక శాఖ డీజీగా ఐపీఎస్‌ని కాకుండా నాన్‌ క్యాడర్‌ అధికారిని నియమించడం గమనార్హం. రూ.252 కోట్ల కాంట్రాక్టును కొల్లగొట్టేందుకేనన్నది స్పష్టమవుతోంది.

మంత్రి పయ్యావుల బంధువే మరి..
ఆనవాయితీకి విరుద్ధంగా అగ్ని మాపక శాఖ డీజీగా నియమితులైన పి.వెంకట రమణ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సమీప బంధు­వు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆయ­న్ని ఏరికోరి ఆ పోస్టులో నియమించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్‌ దోపిడీ కోసం పయ్యావుల కేశవ్‌ బావ చంద్రశేఖర్‌ నాయుడును రిటైరైన తరువాత కూడా ఎక్సైజ్‌ శాఖలో ఓఎస్డీగా నియమించారు. తాజాగా ఆయన బంధువు పి.వెంకటరమణను అగ్ని మాపక శాఖ డీజీగా నియమించడం ప్రభుత్వ కుతంత్రాన్ని బట్టబయలు చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement