
ఆక్వా రంగం ద్వారా సంపద సృష్టికి సూచనలివ్వండి
30 శాతం జీవీఏ సాధించడమే లక్ష్యం.. చేద్దామంటే ఎక్కడా అప్పు పుట్టడం లేదు
ఆక్వా కాంక్లేవ్ 2.0లో సీఎం చంద్రబాబునాయుడు
సాక్షి, అమరావతి: ఆక్వా రంగం బలోపేతానికి, సంపద సృష్టికి మీకు తెలిసిన సలహాలుంటే చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వారైతులు, నిపుణులను కోరారు. మత్స్యశాఖ సౌజన్యంతో గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ 2.0 పేరిట నిర్వహించిన మూడురోజుల వర్కుషాపు ముగింపు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆక్వా రంగంలో 30 శాతం జీవీఏ సాధించడమే లక్ష్యమన్నారు.
ఇందుకోసం త్వరలో డ్రాఫ్ట్ విడుదల చేస్తామని తెలిపారు. ఆక్వారంగం ద్వారా సుస్థిరాభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని కోరారు. ఆక్వారైతులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోతూ తమ ప్రభుత్వంపై రూ.10వేల కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. చేద్దామంటే అప్పు కూడా పుట్టడంలేదన్నారు. కేంద్రం కూడా అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.
గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ సహకారంతో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు. అనధికారిక ఆక్వా చెరువులను క్రమబద్ధీకరించే విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.