ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి సొంతూరికి.. ‘మన రైతు’ పేరిట.. | Success Story Of Software Bollikonda Prakash In Farming At Krishna | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి సొంతూరికి.. ‘మన రైతు’ పేరిట..

Apr 24 2023 7:12 AM | Updated on Apr 24 2023 7:27 AM

Success Story Of Software Bollikonda Prakash In Farming At Krishna - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో రూ.లక్షల జీతంతో సాఫ్ట్‌వేర్‌ కొలువు. విదేశీ పౌరసత్వం. విలాసవంతమైన జీవితం. ఇంతకంటే ఎవరైనా ఏం కోరుకుంటా­రు. హాయిగా అక్కడే సెటిలవ్వాలని చూస్తారు. కానీ.. అతడు అలా ఆలోచించలేదు. సేంద్రియ వ్య­వ­సా­యంపై మక్కువతో 15 ఏళ్లపాటు చేసిన ఉ­ద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చేశా­డు. కుటుంబ సభ్యులతో కలిసి మూడెకరాల్లో సేంద్రి­­య వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. తనలాగే సేం­ద్రియ పంటలు పండిస్తూ మార్కెటింగ్‌ చేసు­కోలేని రైతులతో చేయి కలిపాడు. 50 మందిని రైతు­లను కూడగట్టి ‘మన రైతు’ పేరిట సేంద్రియ ఉత్ప­త్తుల్ని మార్కెటింగ్‌ చేస్తూ వారికి తోడుగా నిలుస్తు­న్నాడు కృష్ణా జిల్లా పోరంకికి చెందిన బొల్లికొండ ప్రకాశ్‌.

సొంతూరికి వచ్చేసి..
ప్రకాశ్‌ ఉన్నత విద్య పూర్తి చేయగానే సాఫ్ట్‌వేర్‌ కొలువును అందిపుచ్చుకున్నాడు. వివిధ దేశాలను చుట్టి చివరకు కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో సెటిలయ్యాడు. ఆరంకెల జీతం. హాయిగా గడిచి­పోతున్న అతడి జీవితంలో ఏదో వెలితి. తన పిల్లల­కు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయన్న బాధ, సొంతూరికి దూరమై­పో­యానన్న ఆవేదన ఆయన్ని కలచివేసింది. చివరకు సొంతూరికి వచ్చేసి తన సోదరి వీరంకి ప్రమీల సాయంతో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టాడు. చిట్టి ము­త్యాలు, సిద్ధసన్నాలు, నారాయణ కామినీ, నవారా వంటి వరి రకాలను సాగు చేయడం మొద­లు పెట్టా­డు. 

వాటికి మంచి డిమాండ్‌ ఏర్పడటంతో సేంద్రి­య పద్ధతుల్లో రాజముడి, కాలబట్టి, మైసూర్‌ మల్లి­గ దేశీ, రత్నచోడి, కుజిపటాలియా, బ్రౌన్, సెమీ బ్రౌన్‌ రైస్‌ పండిస్తున్న రైతుల నుంచి సేకరించి మార్కెటింగ్‌ చేయడం ప్రారంభించాడు. చిరు, తృణధాన్యాలు సాగు చేసే రైతులతో కలిసి వారు పండించే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ‘మన రైతు’ పేరిట మార్కెటింగ్‌ చేస్తున్నారు. సొంతంగా వెబ్‌సైట్, యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా గేటెడ్‌ కమ్యూనిటీస్, అపార్టుమెంట్స్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 

ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం
సేంద్రియ వ్యవసాయంపై మక్కువతోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఈ రంగంలో ఉన్న రైతులు పండించే ఉత్పత్తులను కూడా మార్కెటింగ్‌ చేస్తున్నాను. మార్కెట్‌ ధర కంటే కనీసం 30 శాతం తక్కువ ధరలకే వీటిని అందిస్తున్నాం. మంచి స్పందన వస్తోంది.
– బొల్లికొండ ప్రకాశ్, పోరంకి, కృష్ణా జిల్లా

చిన్నప్పటి నుంచీ మక్కువ
చిరు ధాన్యాలంటే చిన్నప్పటి నుంచి మక్కువ. మా ఇంటిల్లపాదీ వాటినే తింటాం. ఇప్పుడు సొం­తంగా పండిస్తున్నాం. ఆస్ట్రేలియాలో సె­టిలైన మా సోదరుడు ప్రకాశ్‌ ప్రోద్బలంతో మ­రింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించా.
– వీరంకి ప్రమీల, సేంద్రియ రైతు, పోరంకి, కృష్ణా జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement