‘సాఫ్ట్వేర్ ఆత్మహత్య’ విచారణలో దొరకని ఆధారం
ఆమె..ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదు.. ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యలూ లేవు. ఐటీ కంపెనీలో 15 మందికి దిశానిర్దేశం చేసే స్థాయి ఆమెది.. మరి ఎందుకు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది? అనేది సికింద్రాబాద్ రైల్వే పోలీసుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.
చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన బలవన్మరణాల మిస్టరీ క్లూ ఇంతవరకు లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి (37), ఆమె ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి∙(18), విశాల్రెడ్డి (17)లు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విజయశాంతిరెడ్డి తల్లి మొదలు ఇరువైపులా కుటుంబ సభ్యులు ఒకవైపు, ఆమె పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు మరోవైపు...చివరకు ఆమె పిల్లలు చదువుతున్న కళాశాలల్లోని కరస్పాండెంట్లు, క్లాస్ టీచర్లను ఇంకోవైపు.. పోలీసులు ఎవరిని విచారించినా ఒకే మాట. విజయశాంతిరెడ్డి స్ట్రాంగ్ విమెన్. కారులో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె ఆత్మహత్య నిర్ణయం సొంతంగానే తీసుకున్నట్టు నిర్థారణ అవుతున్నప్పటికీ కారణం ఏంటన్న కోణంలో చేస్తున్న దర్యాప్తుకు తెరపడడం లేదు. దుబాయి నుంచి వచ్చి భార్య పిల్లల అంత్యక్రియలకు హాజరైన భర్త సురేందర్రెడ్డి కూడా అదే విషయం చెబుతున్నారు. భర్త సురేందర్రెడ్డిని మరికొన్ని ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలని పోలీసులు భావించినప్పటికీ దశదిన కర్మ తరువాత మాత్రమే కలిసి వివరాలు రాబట్టాలని వారు భావిస్తున్నారు.
‘డిప్రెషన్ ’ దిశగా దర్యాప్తు
ఒంటరి తనంతోనే డిప్రెషన్కులోనై ఆత్మహత్య నిర్ణయం తీసుకుంని ఉంటుందా అనే కోణంలోదర్యాప్తు చేస్తున్నా ఆధారాలు లభించడం లేదు. తన కూతురు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడిన సందర్భాలు లేవని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లేదని, మిగతా ఐదు రోజులు ఇంటి దగ్గర నుంచే పనిచేసేదని తెలిపింది. ఆమె ముఖంలో డిప్రెషన్ వంటి ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొంది.
సైబర్ నిపుణులపైనే ఆశ
విజయశాంతిరెడ్డి వాడిన ఫోన్,ల్యాప్టాప్ పైనే పోలీసులు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆ రెండింటినీ సైబర్ క్రైం విభాగానికి పంపించారు. అందులోని వివరా>లు బయటపడితే మాత్రమే కేసు దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలు ఒకటి, రెండు రోజుల్లోవచ్చే అవకాశముంది.


