నిలకడగా వరద | Sakshi
Sakshi News home page

నిలకడగా వరద

Published Mon, Aug 15 2022 4:21 AM

Srisailam is going to get more flood water Krishna Water - Sakshi

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్‌/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్‌ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది.

ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది.

► నాగార్జునసాగర్‌లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు.
► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు.
► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

గోదావరిలో స్థిరంగా వరద
గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

వంశధారలో పెరిగిన వరద
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్‌లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Advertisement
Advertisement