
పదవి చేపట్టిన తొలి తెలుగువాడు
ఇప్పటి వరకు ఎన్ఏఏఆర్ఎం డైరెక్టర్గా సేవలు
సాక్షి, అమరావతి: భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–న్యూఢిల్లీ) సంచాలకులుగా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. కృష్ణా జిల్లా అవనిగండ్లపాడుకు చెందిన చెరుకుమల్లి..బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఐసీఏఆర్లో పీహెచ్డీ పట్టా పొంది, అదే సంస్థలో ట్రైనీ సైంటిస్ట్గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ అయ్యారు.
30 ఏళ్లుగా ఐసీఏఆర్లో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా చెరుకుమల్లి పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, విధాన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. 300కు పైగా ఈయన సమర్పించిన పరిశోధనా పత్రాలు జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. 8 ఏళ్లుగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా, విస్తరణ యాజమాన్య అకాడమీ (ఎన్ఏఏఆర్ఎం) డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
వ్యవసాయ పరిశోధన మండలిలో కొత్తగా చేరే యువ శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేస్తూ, బోధనలో మార్పులు తీసుకువస్తున్నారు. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ప్రొగ్రామ్ను ప్రవేశపెట్టి దానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చిన ఘనత చెరుకుపల్లిదే. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ పొటాష్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఏఐ) అవార్డుతో పాటు ఎన్ఏఏఎస్, గోల్డెన్ జూబ్లీ, ఐసీఏఆర్ సంస్థల నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డులు అందుకున్నారు. ఇటీవలే పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని కూడా చెరుకుమల్లి అందుకున్నారు.