
ఇంటికెళ్లి జుట్టుపట్టుకుని దాడి
తాళిబొట్టు తెంపి, సెల్ఫోన్ లాక్కున్నారంటూ బాధితురాలి ఆక్రందన
భర్త కోసం వచ్చి తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు
రేణిగుంట: తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, పోలి భీమారం గ్రామానికి చెందిన ఓ మహిళపై రూరల్ ఎస్ఐ అభ్యంతరకర రీతిలో దాడికి పాల్పడిన సంఘటన ఇది. హత్యాయత్నం కేసు ఉందంటూ ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ఎసై.. అతను పొలానికి వెళ్లడంతో అతని భార్యపై దాడికి దిగారు. బాధితురాలి కథనం మేరకు..శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహారావు సిబ్బందితో కలిసి భీమారం గ్రామానికి చెందిన చిన్నమనాయుడు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నమనాయుడు ఎక్కడ?, అతనిపై హత్యాయత్నం కేసు ఉంది, అరెస్ట్ చేయాలని గట్టిగా కేకలు వేశారు.
బూతులు తిడుతూ మాట్లాడాడు. దీంతో పొలం వద్దకు వెళ్లాడని, ఎందుకు అసభ్యంగా మాట్లాడుతున్నారని సంధ్య ప్రశ్నించింది. విచక్షణ కోల్పోయిన ఎస్ఐ ఆమె జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దాడి చేశారు. జాకెట్ చిరిగిపోయిందని, ఎంత ప్రాధేయపడుతున్నా వదలకుండా తాళిబొట్టు తెంచేశాడని సంధ్య కన్నీరుమున్నీరైంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది.
ఎవరిని చంపామో చెప్తే తమంతట తామే వచ్చి స్టేషన్లో లొంగిపోతామని వేడుకున్నా వినకుండా దారుణంగా దాడి చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తిని వివరణ కోరగా, హత్యాయత్నం కేసుకు సంబంధించి కొంత కాలం నుంచి పిలుస్తున్నా చిన్నమనాయుడు స్పందించకపోవడంతో ఎస్ఐ గ్రామానికి వెళ్లారన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.