
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తిరుపతి-సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ పెను ప్రమాదం తప్పింది. బోగి చక్రాల మధ్యలో మంటలు చెలరేగాయి. ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఘటన జరిగింది. సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి (సోమవారం) తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరింది. రాత్రి సుమారు 8-30 గంటల సమయంలో రైలు శ్రీసత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం పరిధిలోని చిగిచెర్ల రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో రైలు వెనుక భాగంలోని ఒక బోగీ చక్రాల వద్ద సడన్గా మంటలు చెలరేగాయి.
బోగీ నుంచి మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విన్న రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆయన లోకో పైలట్కు సమాచార అందించడంతో రైలును నిలిపివేశారు. అనంతరం సిబ్బంది బోగీ చక్రాల వద్ద మంటలను ఆర్పివేశారు.

రైల్లో అధికారులు పూర్తి తనిఖీలు చేశారు. సుమారుగా అరగంట పాటు ఆగిన రైలు నిలిచిపోయింది. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకులు వేయడంతోనే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.