
అత్తారింటికే కన్నం వేశాడు
7 తులాల బంగారు ఆభరణాలు చోరీ
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
బద్వేలు అర్బన్ : భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ... ఇదే అదునుగా భావించి ఆ అల్లుడు ఆమె ఇంటికే కన్నం వేశాడు. రూ.6 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ వెల్లడించారు.
గోపవరం మండలం టీ.సండ్రపల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భర్త అయిన మంగుదొడ్డి మురళి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వీరు గతంలో నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో నివసిస్తూ రెండేళ్ల క్రితం నుంచి అత్తగారింటికి సమీపంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.
నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న అర్బన్ సీఐ రాజగోపాల్
అయితే గత నెల 18వ తేదీన పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన టీ.సండ్రపల్లెకు వెళ్లారు. వారితో పాటు మురళి కూడా వెళ్లాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గత నెల 27న బద్వేలుకు వచ్చిన మురళి తెలుగుగంగ కాలనీలో ఉన్న అత్తగారింటికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.6 లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు (ఒక లాంగ్చైన్, ఒక జత బంగారు గాజులు, ఒక జత బుట్టకమ్మలు, ఒక పాపిడిబిళ్ల) ఎత్తుకెళ్లాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తిరిగి టీ.సండ్రపల్లెకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఉన్నాడు.
మరుసటిరోజు ఇంటి తాళాన్ని తెరిచి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు పెంచలమ్మ రెండవ కుమార్తె శిరీషకు విషయం తెలపడంతో ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ చేసింది అల్లుడు మురళినే అని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో తనతో పాటు ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, సిబ్బంది కలిసి నిందితుడు మురళిని పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నగలు స్వా«దీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకటే‹Ù, ఓబులేసు, చెన్నారెడ్డి, నరసింహులు, కోటేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.