సాక్షి,విశాఖ: ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ మహోత్సవం ఈ ఏడాది తీవ్ర గందరగోళం మధ్య ముగిసింది. పోలీస్, మున్సిపల్, దేవస్థానం అధికారుల మధ్య కనీస సమన్వయం లేకపోవడంతో లక్షలాది మంది భక్తులు రోడ్లపైనే గంటల తరబడి నరకం చూశారు.
ముఖ్యంగా పోలీస్ ముందస్తు వ్యూహాలు, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలు అట్టర్ ప్లాప్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈ నిర్వహణా లోపాలను సరిదిద్దాల్సింది పోయి, ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వివాదానికి తెరలేపడం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మారింది.
ఫోన్ ఎత్తడం లేదు.. గౌరవం ఇవ్వట్లేదు!
గిరిప్రదక్షిణ బందోబస్తు వైఫల్యంపై పోలీస్ శాఖలోని ఇద్దరు కీలక విభాగాల అధిపతుల (పోలీస్ బాస్ ల) మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు అస్తవ్యస్తం కావడంపై ఒక ఉన్నతాధికారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన కింద పనిచేసే కీలక విభాగధిపతి కనీసం తన మాట వినడం లేదని, తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆయన చిర్రుబుర్రులాడినట్లు సమాచారం. అంతేకాకుండా, విశాఖకు చెందిన సదరు పోలీస్ ఉన్నతాధికారి తాను చేస్తున్న ఫోన్లకు కూడా స్పందించడం లేదని, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి
ఆ వ్యాఖ్యలపై మరో విభాగధిపతి కూడా అంతే ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఏ ఒక్కరిదో ఏకపక్ష నిర్ణయాలు నడవవని, మర్యాద, గౌరవం అనేవి ఇచ్చిపుచ్చుకుంటేనే ఉంటాయని ఆయన కౌంటర్ ఇచ్చినట్లు పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారుల మధ్య ఉన్న ఈ ఈగోల వల్లే క్షేత్రస్థాయిలో బందోబస్తు పర్యవేక్షణ పూర్తిగా పక్కదారి పట్టిందని స్పష్టమవుతోంది.
ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే గిరిప్రదక్షిణ లాంటి పెద్ద ఉత్సవానికి కనీస ముందస్తు ప్రణాళికలు వేయడంలో పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాల వల్లే క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన ఆదేశాలు అందలేదని, అందుకే ట్రాఫిక్ మరియు జనసందోహాన్ని నియంత్రించలేకపోయారని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల కష్టాలను తీర్చాల్సిన పోలీస్ బాస్లు, ఇలా ఒకరిపై ఒకరు వాగ్యుద్ధానికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


