రాష్ట్రంలో మరో భారీ సిమెంట్‌ ప్లాంటు

Shree Cement plant in Andhra Pradesh - Sakshi

పల్నాడు జిల్లాలో ప్లాంటు ఏర్పాటుకు శ్రీ సిమెంట్‌ సంసిద్ధత

రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ ప్లాంటు

ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ప్రఖ్యాత శ్రీ సిమెంట్‌ కంపెనీ తమ తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ను రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్‌ యాజమాన్యం పేర్కొంది.

ఏడాదికి 1.5 మిలియన్‌ టన్నుల క్లింకర్, 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శ్రీ సిమెంట్‌ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్‌ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 64 శాతం వినియోగించుకుంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడిని అంతర్గతంగా, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ను 2024 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ వివరాలన్నింటిని శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలియజేసింది.

శ్రీ సిమెంట్‌ సంస్థ ఎండీ హెచ్‌ఎం బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌ గతేడాది డిసెంబర్‌ 20న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి రాష్ట్రంలో సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేశారు. అందులో భాగంగానే భారీ పెట్టుబడితో పెదగార్లపాడులో సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్‌ సంస్థ అధికారికంగా వెల్లడించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top