
ఒంగోలులో నిరసన తెలుపుతున్న సాక్షి ఉద్యోగులు
అన్ని జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష సాధింపు
ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులు
ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదన్న జర్నలిస్టులు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ‘సాక్షి’ కార్యాలయాలపై అకారణంగా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘సాక్షి’ సిబ్బంది సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, ప్రభుత్వ తప్పిదాలను సాక్షి ప్రశ్నిస్తోందన్న అక్కసుతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. సంబంధం లేని విషయాన్ని సాకుగా చూపి ‘సాక్షి’పై దాడులకు టీడీపీ గూండాలను పురమాయించడం దుర్మార్గమన్నారు.
విజయవాడ ఆటోనగర్లోని సాక్షి రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రాత్రి సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కూటమి గూండాలు ఉదయం సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి, నేమ్ బోర్డ్ను ధ్వంసం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడే అని నినదించారు. కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి (రేణిగుంట), ఒంగోలు, మంగళగిరి, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, విశాఖ, శ్రీకాకుళంలో సాక్షి కార్యాలయాల సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు.
ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదని, దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. పార్టీల ముసుగులో పత్రికా కార్యాలయాలపైకి గూండాలను పంపడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పత్రికలపై ఏమాత్రం గౌరవం ఉన్నా, వెంటనే ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేయించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.