
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50 లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. పోస్టాఫీసులో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండడంతో ఇవాళ లేదా రేపు (శుక్ర,శని) అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నగదు గోల్మాల్పై డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.
