ఇసుక అక్రమ దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు
నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో స్వర్ణముఖికి తూట్లు
అక్రమ రవాణాను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులు
భారీ యంత్రాలు పోలీసులకు అప్పగింత
పెళ్లకూరు: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమతవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్ర చేశారు. మాజీ శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పరిసర ప్రాంతాల రైతులు, పార్టీ శ్రేణులు కలిసి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలను, ఇసుక రవాణా చేస్తున్న లారీలను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గంలో 20 నెలలుగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ జరుగుతోందని సంజీవయ్య ఆరోపించారు.టీడీపీ నాయకుల చర్యలతో స్వర్ణముఖినది పరివాహక గ్రామాలైన పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, రావులపాడు, పిడికిటిమాల, యడపూడి తదితర గ్రామాలకు తాగు, సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు నన్నం ప్రిస్కిల్లా, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


