
టీటీడీకి చెందాలని రిటైర్ట్ ఐఆర్ఎస్ అధికారి వీలునామా
పత్రాలు, చెక్కులను అందజేసిన ట్రస్టీలు
తిరుమల: ఓ రిటైర్ట్ ఐఆర్ఎస్ అధికారి తన మరణానంతరం టీటీడీకి చెందాలని రాసుకున్న వీలునామా ప్రకారం రూ.3 కోట్ల విలువైన భవనానికి సంబంధించిన ఆస్తి పత్రాలు, రూ.66 లక్షలు నగదుకు సంబంధించిన చెక్కులను ఆయన ట్రస్టీలు గురువారం టీటీడీకి అందజేశారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు హైదరాబాద్ వనస్థలిపురంలో ‘ఆనంద నిలయం’ పేరుతో రూ.3 కోట్లతో 3,500 చదరపు అడుగుల భవనాన్ని నిర్మించుకున్నారు. దాన్ని, బ్యాంక్లో దాచుకున్న రూ.66 లక్షలను తన మరణానంతరం ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగించాలని వీలునామా రాశారు.
తను బ్యాంక్లో దాచుకున్న సొమ్ములో టీటీడీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.
ఇటీవల ఆయన హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన ట్రస్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్లు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం తిరుమలలో టీటీడీ ఏఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు విరాళమిచ్చింది. సంబంధిత చెక్కులను ఏఈవోకి గురువారం అందజేసింది.