
ఉత్తర్వులు జారీ చేసిన మత్స్య శాఖ
వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు
గంగపుత్రులకు అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ కథనం
దీంతో దిగివచ్చిన కూటమి ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందే వారే అనర్హులంటూ తాజాగా నిబంధనల్లో మార్పులు
సాక్షి, అమరావతి: ‘గంగపుత్రులకు తీరని అన్యాయం.. వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలు కట్’ పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. ‘వేట నిషేధ భృతి’కి అర్హుల గుర్తింపు కోసం జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భృతికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పెన్షన్) పొందే వారు మాత్రమే అనర్హులని.. మిగిలిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ఇతర నిబంధనలను కొంతమేర సడలించింది.
కలకలం రేపిన ఉత్తర్వులు..
సముద్రంలో మత్స్యసంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలవుతుంటుంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం పరిహారం ఇచ్చేది. గతంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది.
అలాగే వేట నిషేధ భృతి పొందిన వారికి సైతం అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింపజేశారు. అధికారంలోకి వస్తే భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తొలి ఏడాది ఎగ్గొట్టింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వారం రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని.. ఈ భృతి పొందే వారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని ప్రకటించింది.
ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. నిబంధనలు మార్చాలంటూ మత్స్యకారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మారిన నిబంధనలు..
వేటకు వెళ్లే బోట్లన్నీ ఏప్రిల్ 14కు ముందు ఎంఎస్ యాక్టు 1958 కింద రిజిస్టరై ఉండాలని.. ఎఫ్ఎంఎఫ్ఆర్ యాక్టు 1995 కింద లైసెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడీ ఆయిల్ ఎంత వినియోగించుకున్నా అర్హులేనని స్పష్టం చేసింది. కాగా, వేట నిషేధ భృతి పొందేవారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎనీ్టఆర్ భరోసా పెన్షన్ పొందేందుకు అనర్హులని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పింఛన్) పొందే వారు మాత్రమే అనర్హులంటూ నిబంధనల్లో మార్పులు చేసింది.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, అర్బన్ ప్రాంతంలో 1.44 లక్షల ఆదాయానికి మించి ఉండకూడదని.. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా 10 ఎకరాల్లోపు మెట్ట, మాగాణి కలిసిన భూములు, 4 చక్రాల వాహనాలు, ఏడాదిలో గరిష్టంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత ఇల్లు కలిగిన వారు అనర్హులని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఆ నిబంధనల స్థానంలో గతంలో మాదిరిగా 6 దశల వెరిఫికేషన్ ద్వారా అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసింది.
రూ.40 వేలు జమ చేయాలి..
తాజా నిబంధనల ప్రకారం బుధవారం(23వ తేదీ) సాయంత్రంలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగే కార్యక్రమంలో ఈ ఏడాది వేట నిషేధ భృతి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఎగ్గొట్టిన రూ.20 వేలు కూడా కలిపి రూ.40 వేలు జమ చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.