నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పనుల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు
ఆయన అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారు
ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే కుట్రలు
సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవనేది దొంగ సాకులే
ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు మొదటి నుంచి కక్షే
పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి సీమ లిఫ్ట్ వరకు అన్నిచోట్లా కుట్రలే
తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి
చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమిస్తాం
జూపాడుబంగ్లా మండలంలో నిలిచిపోయిన లిఫ్ట్ పనులను పరిశీలించిన రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు
కర్నూలు (సిటీ): రాయలసీమ నీటి కష్టాలను తొలగించే లక్ష్యంతో వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలా చేసింది. కానీ, దీనిపై పచ్చిగా అబద్ధాలు ఆడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలినుంచి రాయలసీమ అంటే చంద్రబాబుకు వివక్షేనని విమర్శించారు. తన కోరిక మేరకే రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబు ఆపేశారంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకు చంద్రబాబు కుట్రలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్లో రేవంత్తో చేసుకున్న ఒప్పంద వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలోనే 85% పనులు పూర్తి
‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగుల పైన ఉంటేనే రాయలసీమకు తీసుకెళ్లే పరిస్థితుల్లో అవసరమైన మేర తరలించలేక ఏటా సీమలో పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ను ప్రతిష్ఠాత్మకంగా చేపడితే, చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 85 శాతం పనులు పూర్తిచేసింది. చంద్రబాబు సర్కారు ఏర్పడి 19 నెలలైనా పనులు అంగుళం కూడా కదల్లేదు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి బాబు ప్రజలను మభ్యపెట్టారు. కానీ, రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబు చేసిన దగా, వంచన బట్టబయలైంది. ఆయన ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సీమ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలి’’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే సీమ రైతులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, సాగునీటి నిపుణులు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నంద్యాల జిల్లాలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశం వద్ద వైఎస్సార్సీపీ నేతలు
కేసులు వేయించి.. పనులు నిలిపివేశారు
రాయలసీమలో కరువు శాశ్వత నివారణకు వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపట్టారు. తెలంగాణ అడ్డుచెప్పినా జగన్ దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. ఈ ప్రాజెక్టు ముందుకుసాగితే జగన్కు మంచి పేరు వస్తుందని.. పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు కుట్ర చేసి పనులు నిలిపివేశారు.
–కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
అమరావతి మీదున్న శ్రద్ధ సీమ మీద లేదా?
చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న శ్రద్ధ రాయలసీమ ఎత్తిపోతల మీద లేదు. సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎత్తిపోతలు చేపట్టిన విజనరీ జగన్. కేసులతో అడ్డుకుని కుట్రలు చేసిన చరిత్ర చంద్రబాబుది. సీమ ఎడారిగా మారుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు.
– ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
సీమను నాశనం చేసే కుట్ర
సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో సీమను నాశనం చేసే కుట్రకు తెరలేపారు.
– సాకె శైలజానాథ్, మాజీ మంత్రి, అనంతపురం
రేవంత్తో కలిసి ప్రతిపక్షంలో ఉండగానే కుట్ర
రైతుల కన్నీరు తుడిచే అద్భుత ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పనులు మొదలుపెట్టి 85 శాతం పూర్తిచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా... రేవంత్తో కలిసి ఈ లిఫ్ట్ పనులను ఆపాలని కుట్ర చేశారు. సీఎం అయ్యాక పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపి నిలిపివేశారు.
– దారా సుధీర్, నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి
ఆ నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి?
దివంగత సీఎం వైఎస్... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన తర్వాతే మైలవరం రిజర్వాయర్కు నీరు చేరింది. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు ఉంటోంది. నీరు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది. వృథాగా సముద్రంలో కలిసే నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి?
– పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, కడప
సీమ ప్రజలు చంద్రబాబును క్షమించరు
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. క్లోజ్డ్ రూమ్ మీటింగ్ ఒప్పందాలను బయట పెట్టాలి. పుట్టిన ప్రాంతానికి అన్యాయం చేసేలా కుట్రలు చేస్తున్న బాబును సీమ ప్రజలు క్షమించరు.
– కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ
ఆ జీవో అమలు చేయలేదు
2004లో సీఎం కాగానే సీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి వైఎస్సార్ రైతు బాంధవుడిగా నిలిచారు. తండ్రిని మించి..పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని జగన్ 80 వేల క్యూసెక్కులకు పెంచారు. సీమ లిఫ్ట్ చేపట్టి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా పనులు చేపట్టారు. మిగిలిన పనులను బాబు నిలిపేశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం జీవోను అమలు చేయాలని ఆయనను నేను కోరినా పట్టించుకోలేదు.
– శిల్పాచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం
బాబు ఎప్పుడూ సీమకు మేలు చేయలేదు..
రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్..పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు విస్తరించే పనులు చేపడితే దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు దీక్షలు చేయించారు. బాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి సీమకు మేలు చేయలేదు. పైగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు.
– వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ, అనంతపురం
రైతులు, ప్రాజెక్టుల గురించి బాబు ఆలోచించరు
చంద్రబాబు ఏనాడూ రైతులు, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించరు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబుశ్రీశైలం నీటి వాటాను తెలంగాణకు తాకట్టు పెట్టాడు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపడుతున్నా నోరు మెదపడం లేదు.
– శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నంద్యాల
‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదు
మంత్రి నిమ్మల
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు.
ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్జీటీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..
గత ప్రభుత్వ హయాంలో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా రూ.500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారన్నారు.


