బ్రహ్మోత్సవాల్లో మల్లన్న ఆదాయం రూ.5.61కోట్లు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు రూ.5.61కోట్ల ఆదాయం లభించింది. గురువారం చంద్రవతి కల్యాణ మండపంలో ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. గత 13 రోజులలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.5,61,81,535 లభించినట్లు శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. పలు విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించినట్లు ఈఓ చెప్పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో హుండీ లెక్కింపు చేపట్టారు. పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.


