నారాయణపురం కాలువలో రాకాసి చేప 

Rakasi fish in Narayanapuram canal - Sakshi

రాజాం:   శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మందరాడ గ్రామం వద్ద నారాయణపురం కుడికాలువలో రైతులకు బుధవారం రాకాసి చేప కనిపించింది. రైతులు సరదాగా చేపలు పడుతుండగా ఈ వింత చేప లభించింది. నోరు కింద భాగాన ఉండడంతో పాటు చేప మొత్తం నలుపు రంగులో ఉండి, తెల్లటిచారలు కలిగి ఉంది. ఒంటిపై మొప్పలకు ముళ్లున్న ఈ చేపను ప్రమాదకర చేపగా భావించి చంపిన అనంతరం భూమిలో పాతిపెట్టేశారు. ఈ చేపను దెయ్యం చేప అంటారని, బల్లిచేప, అమెజాన్‌ సైల్ఫీన్, క్యాట్‌ ఫిష్‌ అని కూడా పిలుస్తుంటారని రాజాం ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ తెలిపారు.

ఈ చేప చెరువుల్లో ఉంటే చిన్నచిన్న చేపలను తినేస్తుందని, రైతులకు నష్టం కలిగిస్తుందని వెల్లడించారు. నీటి ప్రవాహాల ద్వారా చెరువుల్లోకి వచ్చేస్తుందని, చెరువుల్లో చేరి ఆహారం తినేయడంతో పాటు ఆక్సిజన్‌ పూర్తిగా పీల్చేస్తుందని, మిగిలిన చేపలను బతకనివ్వదని తెలిపారు. 200 గ్రాములు ఉండే ఈ చేప పెరుగుదల పెద్దగా ఉండదని, కానీ ఏ చెరువులోకి వచ్చినా తీవ్ర నష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఈ చేపను ఎవరూ తినకూడదని, కనిపించిన వెంటనే చంపేసి భూమిలో పాతిపెట్టేయాలని సూచించారు. ఈ చేప సాధారణ పరిస్థితుల్లో కూడా బతకగలదని, నీరులేని భూమిపై కూడా 15 రోజులు నుంచి నెలరోజులు బతుకుతుందని వివరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top