రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికితోడు ఏపీ, యానాం పరిధిలోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల గాలులు బలంగా వీస్తున్నాయని తెలిపింది.
వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా పరిధిలో గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.


