సాక్షి,విజయవాడ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి, ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే, వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
రావణ్పై ఏపీలో ఇప్పటివరకు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, మరియు గన్నవరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు.


