అటు సుందర ‘కొల్లేరు’.. ఇటు కాలుష్యంతో కన్నీరు | pollution of water in Kolleru Lake | Sakshi
Sakshi News home page

అటు సుందర ‘కొల్లేరు’.. ఇటు కాలుష్యంతో కన్నీరు

Jun 17 2025 5:35 AM | Updated on Jun 17 2025 5:35 AM

pollution of water in Kolleru Lake

‘సుప్రీం’ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ కోర్టుకెక్కిన కాకినాడకు చెందిన పర్యావరణవేత్త 

ఆక్రమణలు తొలగించి మూడునెలల్లో హద్దులు నిర్ణయించాలని ‘సుప్రీం’ ఆదేశం

దీంతో కేంద్ర సాధికార కమిటీ నేడు, రేపు కొల్లేరులో పర్యటన

ఇప్పటికే అనేక కమిటీలు పలు సిఫార్సులు చేసినా మారని పరిస్థితి

సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే ఓ వైపు సుందర కొల్లేరు.. మరోవైపు కలుషిత కన్నీరు సాక్షాత్కరిస్తాయి. పర్యావరణపరంగా చిత్తడి నేల వ్యవస్థగా, వలస పక్షుల కేంద్రంగా, జీవ వైవిధ్యానికి నిలయంగా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కొల్లేరు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నడుమ విస్తరించింది. ఒకనాడు కొల్లేరు ప్రజల బతుకుదె­రువు కోసమే ప్రభుత్వం బలవంతంగా చెరువులు తవ్వించి చేపలు సాగుచేయిస్తే.. అవే ఇప్పుడు కొల్లేరుకు ముప్పుగా పరిణమించాయి. నేడు చేపల చెరువు­లను నిర్మూలించే స్థాయికి పరిస్థితి వచ్చింది.

ఎందుకంటే.. కొల్లేరులో దాదాపు 60 శాతం చేపల చెరువులే ఉండడంతో పర్యావరణ సమస్య తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయమై అనేకమార్లు పర్యావరణవేత్తలు కోర్టు తలుపులు తట్టడంతో కొల్లేరు పరిరక్షణ అనేది ప్రధాన అజెండాగా తెరమీదకు వస్తోంది. దీంతో అక్కడి ప్రజల మనుగడ కోసం మళ్లీ రోడ్డెక్కి పోరాటాలకు సిద్ధమయ్యే పరిస్థితికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు దాదాçపు ఏడు కమిటీలు కొల్లేరు సమస్యపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదు.

కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ కాకినాడకు చెందిన పర్యావరణవేత్త మృత్యుంజయరావు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆక్రమణలు తొలగించి మూడునెలల్లో హద్దులు నిర్ణయించాలని న్యాయస్థానం ఆదేశించింది. ‘సుప్రీం’ ఆదేశా­లతో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) మంగళ, బుధ వారాల్లో రెండ్రోజుల­పాటు కొల్లేరులో పర్యటించి అక్కడి స్థితిగ­తులను అధ్యయనం చేయ­నుంది.

ఇప్పటివరకు కమిటీలు ఏం చెప్పాయంటే.. 
కొల్లేరు సరస్సు సంరక్షణ, పర్యావరణం, జీవవైవిధ్యం, స్థానిక సమాజాల జీవనోపాధులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనేక కమిటీలను ఏర్పాటుచేశాయి. ఈ కమిటీలు పలు సిఫార్సులు చేశాయి. బొంబాయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌) కమిటీ, సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు కీలక అంశాలపై

నివేదికలు ఇచ్చాయి. అవేమిటంటే..
కొల్లేరు సరస్సులో చుట్టూ అక్రమ చెరువులను (ఆక్వాకల్చర్‌) నియంత్రించాలి.. 
⇒ సరస్సు సహజ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలి..
⇒ పక్షుల సంరక్షణకు కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సామర్థ్యాన్ని పెంచాలి..
⇒ స్థానిక మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అందించాలి.
ఇక రాష్ట్ర ప్రభుత్వం 1982లో కొల్లేరు సరస్సు అభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసినప్పటికీ కాలుష్య నియంత్రణలో ఇప్పటికీ ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా మంగళ, బుధవారాల్లో కేంద్ర సాధికార కమిటీ పర్యటనపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement