రూటు మారినా తగ్గని జన సునామీ | People of NTR district extend a warm welcome to YS Jagan | Sakshi
Sakshi News home page

రూటు మారినా తగ్గని జన సునామీ

Feb 7 2026 5:18 AM | Updated on Feb 7 2026 5:19 AM

People of NTR district extend a warm welcome to YS Jagan

చంద్రబాబు సర్కారు కుట్రలను భగ్నం చేస్తూ భారీగా తరలివచ్చిన జనం

అభిమాన నేత వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎన్టీఆర్‌ జిల్లా ప్రజానీకం

తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు దారిపొడవునా జగన్నినాదం

పలు చోట్ల ఆగుతూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్‌ జగన్‌

పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు  

నేతలకు నోటీసులు.. పర్యటనలో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు  

ప్రజాభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి ఆరు గంటల సమయం

జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జననేత

తాడేపల్లి రూరల్‌ / వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ) : సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా, రూటు మార్చినా జననేత పర్యటనకు జనం సునామీలా తరలివచ్చారు. 17 కిలోమీటర్ల దూరం 47 కిలోమీటర్లకు పెరిగినా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను దగ్గర్నుంచి చూడాలని, పలకరించాలని, కుదిరితే కరచాలనం చేయాలనే ఆసక్తితో అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు. 

సీఎం.. సీఎం.. జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలతో పర్యటన ఆద్యంతం మార్మోగింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్‌ ఇంటిపై ఇటీవల తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేసి.. పెట్రోల్‌ బాంబులు విసిరి దగ్ధం చేయటానికి కుట్రలు చేసిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఉదయమే తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసం వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. 

వైఎస్‌ జగన్‌.. నివాసం నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినదించారు. కాన్వాయ్‌ భరతమాత సెంటర్‌ వద్దకు వచ్చేసరికి రోడ్డుపై మహిళలు, అభిమానులు భారీగా ఉండడంతో.. వైఎస్‌ జగన్‌ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అక్కడి నుంచి పాతూరు క్రాస్‌రోడ్‌ వరకు కారులో నుంచి పలుమార్లు బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. భారీగా అభిమానులు రావడంతో అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశానికి చేరుకునే సరికి ఆలస్యమైంది. 

అయినా ప్రజలు రోడ్డుపై ఉండి ఆయన కోసం ఎదురు చూశారు. కాజ వద్ద గ్రామస్తులు భారీగా స్వాగతం పలికారు. 2029లో జగనే ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. కాజ టోల్‌గేటు వద్ద కూడా అదే పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించి, ప్రజల్ని అడ్డుకున్నా వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు జనం పోటీ పడ్డారు. దారిపొడవునా బస్సుల్లో నుంచి ప్రజలు అభివాదం చేశారు. చినకాకాని వెస్ట్‌ బైపాస్‌ ప్రారంభంలో ఒక దివ్యాంగుడు వేచి ఉండటం గమనించి వైఎస్‌ జగన్‌ కారు దిగి, అతనితో కరచాలనం చేశారు. 

వెస్ట్‌ బైపాస్‌లో ఎక్కడా రోడ్డుపైకి వచ్చేందుకు అవకాశం లేకపోయినా బైపాస్‌ వెంబడి పలుచోట్ల ప్రజలు జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. వెంకటపాలెం టోల్‌ గేటు వద్ద 10 నిమిషాల పాటు జగన్‌ కాన్వాయ్‌ ఆపి.. అక్కడికొచ్చిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో పాటు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. 

పర్యటనను నీరుగార్చే కుట్ర భగ్నం
వైఎస్‌ జగన్‌ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటికి వెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో పోలీసు శాఖకు తన పర్యటన వివరాలను ముందుగానే పంపించారు. అయితే ఆయన పర్యటనను నీరుగార్చేందుకు, ప్రజలు ఆయన్ను కలవకుండా చేసేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసింది. 

ముందు ప్రకటించిన రూట్‌లో కాకుండా మంగళగిరి మీదుగా కాజ టోల్‌గేటు వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని గురువారం రాత్రి నోటీసులు జారీ చేసింది. దాంతో పార్టీ క్యాడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. అయినా శుక్రవారం ఉదయం వైఎస్‌ జగన్‌ వస్తున్న రూట్‌ వివరాలను తెలుసుకొని తదనుగుణంగా పార్టీ శ్రేణులు, ప్రజలు జగన్‌ పర్యటించే మార్గంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. పోలీసుల కుట్రలను భగ్నం చేసి, పర్యటనను విజయవంతం చేశారు.

వాహనాలను అడ్డుకున్న పోలీసులు  
వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకోవటానికి పోలీసు శాఖ తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. ఇందులో భాగంగా అడుగడుగునా ఆంక్షలు విధించింది. పార్టీ నేతలను పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా, పలు చోట్ల వాహనాలను అడ్డుకున్నారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా పలువురు నాయకులు ర్యాలీగా వెళ్లకూడదంటూ నోటీసులు జారీ చేశారు. 

నేతల వెంట జనం ఉండకూడదని హెచ్చరించారు. నోటీసులను ధిక్కరిస్తే కేసులు పెడతామని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయినా పార్టీ శ్రేణులు వేలాదిగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా కార్యక్రమానికి తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ఇలా అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలు దేరిన జగన్‌.. ఇబ్రహీంపట్నం చేరుకునే సరికి సాయంత్రం 5 గంటలైంది.

ఇలా ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. గొల్లపూడి నుంచి జోగి రమేష్‌ ఇల్లు చేరుకునేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే జనాభిమానం ఏమేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. దారిపొడవునా తన కోసం వేచి ఉన్న ప్రజలకు వైఎస్‌ జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

వేలాదిగా బైక్‌లపై తరలివచ్చిన యువత
పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే తాడేపల్లి కార్యాలయానికి చేరుకొని వైఎస్‌ జగన్‌ను అనుసరించారు. ఎక్కడికక్కడ పోలీసులు వాహనాలను అడ్డుకొని వేరు మార్గాల వైపు తరలించినా, అభిమానులు అంతకంతకూ పెరిగారు. వేలాది మంది ద్విచక్ర వాహనాలపై తరలి వచ్చి, తమ అభిమాన నేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. పలువురు న్యాయవాదులు వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలిపారు. బైపాస్‌ నల్లకుంట నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటి వరకు రోడ్డుపై జనం ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయారు.  

జోగి రమేష్‌ కుటుంబానికి భరోసా
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. దాడి జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఎంతసేపు దాడి జరిగింది.. మారణాయుధాలతో ఎలా భయపెట్టారు.. పెట్రోల్‌ బాంబులు ఎలా విసిరారు.. తదితర విషయాలను జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు వివరించారు. దాడి జరిగిన సమయంలో వారు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను జననేతకు చెప్పుకున్నారు. 

ఇలాంటి దాడులకు భయ­పడొద్దని, తాను అండగా ఉంటానని వారికి జగన్‌ భరోసా కల్పించారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో దాడి చేసిన వారిని చట్టపరంగా న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పారు. కాగా, వైఎస్‌ జగన్‌తో పాటు పలువురు నేతలు జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 

మాజీ మంత్రి ఆర్కే రోజా, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్‌ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌­రావు, కైలే అనిల్‌­కుమార్, అన్నాబత్తుల  శివకుమార్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌­కుమార్, ఎండి రుహుల్లా, వరుదు  కళ్యాణి, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, తిరు­వూరు ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామి దాసు, పెనమలూరు ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్, డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజ రెడ్డి, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, నాయకులు ఏ రవిచంద్ర, పుణ్యశీల, వేముల తిరుపతిరావు, వంగవీటి నరేంద్ర తదితరులు జోగి రమేష్‌ను కలిశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement