విధులకు హాజరవ్వని వైద్య సిబ్బందికి నోటీసులు | Notices to medical staff not attending to duties | Sakshi
Sakshi News home page

విధులకు హాజరవ్వని వైద్య సిబ్బందికి నోటీసులు

Jun 9 2022 5:52 AM | Updated on Jun 9 2022 3:07 PM

Notices to medical staff not attending to duties - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగుల హాజరుపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడటానికి వీల్లేదని పలుమార్లు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నెల నుంచి బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే వేతనాల చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

వైద్య విధాన పరిషత్, డీఎంఈ, ప్రజారోగ్య విభాగాల్లో 2021 ఆస్పత్రులు, పరిపాలన కార్యాలయాలున్నాయి. వీటిలో 52,061 మంది ఉద్యోగులు రిజిస్టర్‌ అయ్యారు. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాల చెల్లింపు అమలులోకి తెచ్చినా ప్రజారోగ్య, డీఎంఈ విభాగాల్లో 25% మంది చొప్పున, వైద్య విధాన పరిషత్‌లో 16% మంది ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేయడం లేదు. దీంతో సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరు అవుతున్న వారికి నోటీసులివ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.  

క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి  సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో బయోమెట్రిక్‌ వేసే అవకాశం కల్పించాలన్నది అధికారులు యోచన. సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న, ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళుతున్న వారికి వచ్చే వారం నుంచి వార్నింగ్‌ నోటీసులిస్తామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నివాస్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement