‘గడప గడపకు..’ ఆ బాలికకు మలుపు! | New life for a girl who dropped out of school | Sakshi
Sakshi News home page

‘గడప గడపకు..’ ఆ బాలికకు మలుపు!

Apr 13 2025 3:09 AM | Updated on Apr 13 2025 3:09 AM

New life for a girl who dropped out of school

చదువు మానేసిన బాలికకు కొత్త జీవితం 

జగన్‌ ప్రభుత్వ కార్యక్రమంతో ఇంటర్‌లో చేరిక 

966 మార్కులతో ఇప్పుడు కర్నూలు జిల్లాలో బైపీసీ టాపర్‌ 

ఆస్పరి:  ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో మందికి ఆశాజ్యోతి వెలిగించిందనడానికి చక్కటి ఉదాహరణ.. నిర్మల.  చదువు మానేసిన ఈ బాలిక జీవితాన్ని, జగన్‌ ప్రభుత్వం చేపట్టిన  ప్రతిష్టాత్మక కార్యక్రమం మలుపు తిప్పింది. ఇంటర్మీడియట్‌ బైపీసీలో 1000కి 966 మార్కులతో ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆ బాలిక గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది.  ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా సామాన్యుల జీవితాల్లో వచ్చే మార్పుకు ఇది గొప్ప ఉదాహరణ. 

ఐపీఎస్‌ కావడమే తన లక్ష్యమని చెబుతున్న ఈ బాలిక వివరాల్లోకి వెళితే, ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన శీనప్ప, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. చిన్న కుమార్తె నిర్మల 2021–22లో పెద్దహరివాణం జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్లో 10వ తరగతిలో 537 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులు అంతటితో చదువు మాన్పించారు.

‘గడప గడపకు మన ప్రభుత్వం’.. ప్రోత్సాహం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సరిగ్గా రెండేళ్ల క్రితం అప్పటి ఆదోని ఎమ్మెల్యే వై.­సాయి ప్రసాద్‌ రెడ్డి పెద్దహరివాణంలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటుండగా, విద్యార్థిని విషయం తెలిసి చలించిపోయారు. ‘నాకు బాగా చదువుకోవాలని ఉంది’ అని బాలిక నిర్మల చెప్పడంతో అప్పటికప్పుడు ఈ విషయాన్ని  అప్పటి జిల్లా కలెక్టర్‌ జి.సృజన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ కూడా నిర్మలను భుజంతట్టి ప్రోత్సహించారు.  

ఆస్పరి కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్‌  బైపీసీలో చేర్పించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలిక 440కి 420 మార్కులు సాధించింది. తాజాగా విడుదలైన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000కి 966 మార్కులు సాధించి, జిల్లాలో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. జిల్లాలో 26 కస్తూర్బా పాఠశాలలు ఉండగా..  బైపీసీ గ్రూపు ఆస్పరిసహా ఎనిమిది పాఠశాలల్లో  ఉంది. చక్కటి ఫలితాలతో నిర్మల, బాలికలకు ఆదర్శంగా నిలిచినట్లు ఆస్పరి కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌ శారూన్‌ స్మైలీ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement