ముస్లిం మహిళ ఆస్తిని ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించిన రామకృష్ణ ప్రసాద్
తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నా 90 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారు
బైపాస్ పక్కనే ఉండటంతో కోట్ల విలువ చేసే ఆస్తి కబ్జాకు కుట్ర పన్నారు
రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ ప్రసాద్పై ముస్లిం మహిళ ఆగ్రహం
న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి స్థలం వద్ద నిరసన, రాస్తారోకో
పిడుగురాళ్ల: బైపాస్ పక్కనే ఉన్న కోట్ల విలువైన స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణ ప్రసాద్ కబ్జా చేశారని పేర్కొంటూ సయ్యద్ రోషన్బీ అనే ముస్లిం మహిళ ఆమె సోదరుడు రోషన్, ఇతర బంధువులతో కలిసి ఆందోళనకు దిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితుల సమాచారం ప్రకారం పిడుగురాళ్ల వద్ద పిల్లుట్ల రోడ్డు సమీపంలో అద్దంకి–నార్కెట్పల్లి బైపాస్ పక్కన సయ్యద్ రోషన్బీకి తన 90 సెంట్ల స్థలం ఉంది. దీనిపై రామకృష్ణ ప్రసాద్ కన్ను పడింది. అంతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి ఈ స్థలాన్ని తన అనుచరుల చేత కబ్జా చేయించాడు. ఇదేమని అడగడానికి వెళ్లిన బాధితురాలిని స్థలం వద్దకు వస్తే చంపుతానని భయపెట్టాడు.

మహిళ అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించి భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ దారుణంపై బాధితురాలు తహసీల్దార్, మునిసిపల్, పోలీస్ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం దక్కలేదు. ఈ క్రమంలో ఏకంగా కబ్జా చేసిన స్థలంలో గోడ నిర్మించి, రామ్ టౌన్ షిప్ అని అర్చీని ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో రోషన్బీ ఆదివారం తన సోదరుడు, ఇతర బంధువులతో కలిసి స్థలం వద్ద నిరసన, బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తమ స్థలంలో నిరి్మస్తున్న అక్రమ కట్టడాలను తొలగించాలని నినాదాలు చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శివనాగరాజు ఘటన స్థలం వద్దకు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. డాక్యుమెంట్లను పరిశీలించిన ఆయన, ఇవి సరైనవే అయితే సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. దీంతోపాటు సీఐ వెంకట్రావుకు ఫోన్ చేసి బాధితులతో మాట్లాడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ వెంకట్రావు చెప్పటంతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు.


