రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి : కోవిడ్, కర్ఫ్యూ దృష్ట్యా రైతులు, వినియోగదారులపై.. ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. గురువారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలన్నారు. నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తగిన అనుమతులు కల్పించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.