విశాఖపట్నం : వారం రోజుల సెలవు తరువాత విధులకు వచ్చిన ఆ ఉద్యోగి మృత్యు ఒడికి చేరడంతో ఓ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్కు 2018లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం ఒక కుమారుడు పుట్టాడు. ఈ నేపథ్యంలో భానుకుమార్ వారం రోజులపాటు పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు.
ఆదివారం వరకు సెలవులో ఉన్న అతడు సోమవారం మధ్యాహ్నం బీ షిఫ్ట్కు వచ్చాడు. డ్యూటీకి వచ్చిన రెండున్నర గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అతడు సీ షిఫ్ట్కు రావాల్సి ఉంది. కొలీగ్ ఒకరు కోరడంతో తన డ్యూటీని బీ షిఫ్ట్కు మార్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి మృతి వార్తతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.


