పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి
మదనపల్లె టౌన్/చిత్తూరు : పాడెపై తీసుకెళుతున్న ఓ వ్యక్తి లేచి కూర్చున్న సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం జరిగింది. వీఆర్వో కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి మండలంలోని కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించి చనిపోయాడని భావించారు. ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై మోసుకెళుతుండగా ఒకసారిగా లేచి కూర్చున్నాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించడంతో కోలుకు న్నాడు. అయితే అతని వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.