ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

Llive: Andhra Pradesh Assembly Winter Session 2nd Day - Sakshi

 ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడి వేడిగా జరిగాయి. పలు ప్రభుత్వ పథకాలు, బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశాలను రేపటికి(బుధవారం)వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 

నవరత్నాలు, పేదలకు ఇళ్లపై చర్చ

  • ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఆంజనేయులు అనుచరుడు..పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులో కేసు వేశారు: సీఎం జగన్
  • మైనింగ్ జరగకపోయినా మైనింగ్‌కు కేటాయించిన భూములని పిటిషన్ వేశారు
  • టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవే భూమూల్లో ఐఐటీ పెట్టాలని అడిగారు
  • పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే మాత్రం కుట్రపూరితంగా కోర్టులకు వెళ్తున్నారు
  • కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు సతీష్ కూడా కోర్టుకెళ్లారు
  • కాకినాడలో పేదలకు ఇవ్వాలనుకున్న స్థలాల పక్కనే టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది..
  • మడ అడవులు లేకుండానే ఉన్నట్టుగా కోర్టులో పిటిషన్ వేశారు
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కోర్టు కెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు..
  • చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారు
  • అనంతపురం జిల్లాలో పరిటాల సునీత అనుచరులు కోర్టుకెళ్లారు
  • కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి పీఏ మురళి కోర్టుకెళ్లారు..
  • 3,65,680 ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకెళ్లారు
  • కోర్టు స్టేలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
  • 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం
  • గతంలో 220 ఎస్‌ఎఫ్‌టి ఇళ్లు ఇచ్చేవారు..ఇప్పుడు 340 ఎస్‌ఎఫ్‌టి ఇళ్లు ఇవ్వబోతున్నాం
  • తొలిదశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం
  • రూ.28,084 కోట్లతో తొలిదశ ఇళ్ల నిర్మాణం
  • టిడ్కో ఇళ్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
  • లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • రూ.10,484 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడుతుంది

టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఒక రోజు పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యులను తీసుకెళ్లేందకు వచ్చిన మార్షల్స్‌పై టీడీపీ  ఎమ్మెల్యేలు దాడి చేశారు. 

చంద్రబాబును అర్జంటుగా పిచ్చాస్పత్రిలో చేర్పించాలి. ఆయన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు హానికరం. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు లభించదు - సీఎం జగన్‌

సభను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ను చంద్రబాబు నాయుడు అవమానించారు. స్పీకర్‌ వైపు వేలు చూపిస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. సభాధ్యక్షుడినే బెదిరాస్తారా అని చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాట్లాడే పద్దతి నేర్చుకోవాలని హితవు పలికారు. 

నవరత్నాలు, పేదలకు ఇళ్లపై ఏపీ అసెంబ్లీలో చర్చ

  • 30,66,818 మంది లబ్ధిదారులను గుర్తించాం: మంత్రి రంగనాథరాజు
  • రూ.23,500 కోట్ల విలువైన 68,677.83 ఎకరాలను పంపిణీకి సిద్ధం చేశాం..
  • 25,433.33 ఎకరాల ప్రభుత్వ భూమి, 25,359.31 ఎకరాల ప్రైవేట్ భూమి..
  • గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఒకటిన్నర సెంటు, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి
  • లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను సమకూర్చేందుకు 17,500 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశాం..
  • 2024 నాటికి 30.90లక్షల గృహాలు చేపట్టాలని నిర్ణయించాం: మంత్రి రంగనాథరాజు
  • గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో 28.38లక్షల గృహాలు..
  • ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో 2.6లక్షల గృహాల నిర్మాణం: మంత్రి రంగనాథరాజు
  • రూ.28,084 కోట్లతో తొలి దశలో 15.60లక్షల గృహాల నిర్మాణం
  • రూ.22,860 కోట్లతో రెండో దశలో 12.70లక్షల గృహాల నిర్మాణం
  • డిసెంబర్ 25న తొలి దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నాం
  • 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించాం: రంగనాథరాజు
  • రెండో దశ డిసెంబర్ 2021లో ప్రారంభించి జూన్ 2023 నాటికి పూర్తి చేస్తాం
  • చంద్రబాబు ప్రభుత్వంలో పీఎంఏవై కింద నిర్మించిన గృహాలకు..రూ.430 కోట్ల పెండింగ్‌ బిల్లులు సీఎం జగన్ విడుదల చేశారు
  • గృహ నిర్మాణం కింద గత ప్రభుత్వం 2.07లక్షల మంది లబ్ధిదారులకు..బకాయిలు పెట్టిన రూ.900 కోట్లను మా ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • 2015 నుంచి 2018 వరకు పీఎంఏవై కింద 7లక్షల గృహాలు మంజూరయ్యాయి..2017-18లో 5లక్షల గృహాలకు మాత్రమే పరిపాలన అనుమతులు ఇచ్చారు
  • 2019 మే 1 నాటికి కేవలం 77,371 గృహాలు మాత్రమే పూర్తి చేశారు
  • మౌలిక వసతుల కోసం రూ.2,428 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా..కేవలం రూ.345 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు: రంగనాథరాజు
  • పూర్తయిన ఇళ్లలో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్‌, రోడ్ల సదుపాయాలు లేవు. మౌలిక వసతులు లేకపోవడం వల్లే లబ్ధిదారులకు స్వాధీనపరచలేదు: రంగనాథరాజు
  • 300 చ.ద. అడుగుల గృహాలను గతంలో 2.65లక్షలు చెల్లించాల్సి వచ్చేది..ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ..లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
  • టిడ్కో ఇళ్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆదా: రంగనాథరాజు

ఆయననే మాట్లాడమనండి: సీఎం జగన్‌
ఆక్వా బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు చేసిన సూచనలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. వెంటనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు అడ్డుతగిలారు. చర్చ కొనసాగిస్తున్న రామరాజును పక్కనపెట్టి తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో సీఎం జగన్‌ జోక్యం చేసుకున్నారు. చర్చలో మాట్లాడుతున్న సభ్యుడిని కాదని తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి దానికి ఇలా అడ్డుపడే బదులు చంద్రబాబే మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్ష నేతే చర్చలో పాల్గొంటే తామంతా సంతోషిస్తామని, విపక్షం తరపున చర్చలో పాల్గొనే అవకాశం చంద్రబాబు ఇవ్వాలని కోరుతున్నామని సీఎం జగన్‌ అన్నారు.


చంద్రబాబు విష ప్రచారం: మల్లాది విష్ణు
చంద్రబాబు తీరు శాసనసభను, రాజ్యాంగ వ్యవస్థలను కించ పరిచేలా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్‌ విసిరారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, వాటిలో వెయ్యి కోట్లు తమ ప్రభుత్వం కట్టిందని వెల్లడించారు. రివర్స్ టెండర్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో అవినీతి బయట పడిందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని    చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల అంశంలో  టీడీపీ పనికట్టుకుని దుష్ప్రచారనికి తెరలేపిందని ఆరోపించారు.

నిమ్మల రామానాయుడు సస్పెన్షన్‌
సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన పాలకొల్లు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును ఒకరోజు పాటు స్పీకర్‌ సస్సెండ్‌ చేశారు. రెండవ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. బిల్లులపై చర్చ జరగకుండా సభకు ఆటకం సృష్టిస్తున్నారు. పొడియం ముందు నిలబడి నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.


దటీజ్‌ జగన్‌!
తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ‘జగన్‌ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావ’ని సీఎం జగన్‌ అన్నారు.

టీడీపీ సభ్యులపై స్పీకర్‌ ఆగ్రహం
హౌసింగ్‌పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వమే అజెండాలో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. అయినప్పటీకి టీడీపీ సభ్యులు పట్టువీడకుండా సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకోవడంతో స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గందరగోళం సృష్టించడం సమంజసం కాదని హితవు పలికారు.


టీడీపీకి భయం ఎందుకు?
టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ రచ్చ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ప్రతిపక్ష సభ్యులు నిన్న వ్యవసాయ రంగంపై చర్చ అంటే సీఎం జగన్‌ పెద్ద మనసుతో మిగతా అంశాలను పక్కనపెట్టి అంగీకరించారు. చర్చ ప్రారంభించిన తర్వాత డ్రామా క్రియేట్‌ చేసి రచ్చ చేశారు. ఈరోజు హౌసింగ్‌పై చర్చ అడిగారు. సరే ఇస్తామంటే.. లేదు లేదు ఇప్పుడే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఏ అంశంపైనా అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టీడీపీ సభ్యులు ఇంత భయపడుతున్నారేందుకు?’ అని ప్రశ్నించారు.


టీడీపీ అనవసర రాద్ధాంతం: బుగ్గన

టీడీపీ సభ్యులు కావాలనే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. దీంతో రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకున్నారు. సజావుగా జరిగే సభను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, ఈ విధంగా అడ్డుకోవడం అన్యాయమన్నారు. నిన్న కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి సభను అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ జరిగితే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ముగ్గురికి నివాళి
మాజీ మంత్రి పెనుమత్స సాంబశివ రాజు, మాజీ ఎమ్మెల్యేలు పి నారాయణరెడ్డి, ఖాలీల్‌ బాషాలకు శాసనసభ సంతాపం తెలిపింది. తర్వాత సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ బిల్‌, ఏపీ ఆక్వా కల్చర్‌ సీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌, ఏపీ ఫిషరిస్‌ యూనివర్సిటీ బిల్‌-2020లపై చర్చను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతుండగానే టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు.


చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: చీఫ్‌ విప్‌
ప్రతిపక్ష నేత నిన్న సభలో మాట్లాడిన తీరు దురదృష్టకరమని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షనేత అలా వ్యవహరిస్తే ఇక కింది వాళ్ళు బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు విని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారాన్ని మరిచి ముఖ్యమంత్రిని వాడూ వీడు అని వ్యాఖ్యానించడం దారుణమని, చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభలో 10 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ, కరోనా నియంత్రణలో విజయవంతమైన ప్రభుత్వ చర్యలపై చర్చ జరగనుంది. కాగా, టిస్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top