
కీర్తి చక్ర పురస్కారం అందుకున్న మేజర్ మళ్ల రామ్గోపాల నాయుడు
సంబరపడుతున్న జిల్లా వాసులు
అద్భుత సాహసంతో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు పురస్కారం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సంతబొమ్మాలి: సిక్కోలు సంబరపడింది. జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్గోపాలనాయుడు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా దేశ రాజధానిలో ‘కీర్తి చక్ర’ అవార్డును అందుకున్నారు. ఈ క్షణాలు చూసి జిల్లా యావత్తు మురిసిపోయింది. ఈయన స్వగ్రామం సంత»ొమ్మాళి మండలంలోని నగిరిపెంట గ్రామం. 2023 అక్టోబర్ 26న జరిగిన ఓ ఆపరేషన్లో మేజర్ రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆ పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించారు. రామ్గోపాల నాయుడు తల్లిదండ్రులు నగిరి పెంటకు చెందిన రైతు మళ్ల అప్పలనాయుడు, హేమమాలిని.
కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన రామ్ 2012లో యూపీఎస్సీ నిర్వహించిన స్టాఫ్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఎగ్జామ్ రాసి పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ మూడేళ్లు అభ్యసించి, 2015–16లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో క్యాడెట్గా చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న 900మందిలో గోల్డ్మెడలిస్ట్గా నిలిచి, ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా బాధ్యతలు స్వీకరించా రు. లెఫ్టినెంట్గా పనిచేసిన రెండేళ్లలో(2018)నే కెప్టెన్గా పదోన్నతి సాధించారు. అక్కడికి నాలుగేళ్లలో (2022)లో మేజర్గా ప్రమోషన్ లభించింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..?
2023 అక్టోబర్ 26 ఉదయం 10.10గంటలకు ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని ఓ జవాన్ ద్వారా తెలుసుకున్నారు. 10.25 గంటలకు రంగంలోకి దిగిన రామ్గోపాలనాయుడు తోటి జవాన్లకు మార్గనిర్దేశం చేసి, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. తన దళాలకు ప్రమాదాన్ని గ్రహించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని గాయపరిచినప్పటికీ ఆ ఉగ్రవాది భారీ కాల్పులు జరిపాడు. ఆ భీకర కాల్పుల మధ్య జవాన్లతో కలిసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది ఒక గుహలో దాగి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆర్మీ బృందంపై గ్రనేడ్ కూడా విసిరాడు. దాని నుంచి తప్పించుకుని భయçపడకుండా ఆ ఉగ్రవాదిని పట్టుకుని హతమార్చారు. తన పోరాటంలో భాగంగా జవాన్లను కాపాడుకోవడం కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
దేశంలోనే గుర్తింపు వచ్చింది
ఆర్మీ మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల దేశంలోనే మా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదులను అంతం చేయడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోవడం మా అందరికీ గర్వంగా ఉంది. – ఎం.రాజు, నగిరిపెంట గ్రామం, సంతబొమ్మాళి మండలం సంతోషంగా ఉంది మా గ్రామానికి నిజమైన పండగ వచ్చింది. మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల మా గ్రా మానికి ప్రత్యేకత వచ్చింది. కీర్తి చక్ర అవార్డు అందుకోవడం మాకు సంతోషంగా ఉంది.
– ఎం.సోమేశ్వరరావు, నగిరిపెంట గ్రామం
స్ఫూర్తిగా తీసుకోవాలి..
మేజర్ రామ్గోపాల్ నాయుడును యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. కీర్తి చక్ర అవార్డు అందుకున్న రామ్గోపాల్నాయుడు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.
– ఉల్లాస లోకేశ్వరరావు, రిటైర్ నాయక్ సుబేదార్