ఆందోళన చేస్తున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు
కొనసాగుతున్న గాలింపు
మహారాణిపేట: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భారత తీర రక్షక దళం, భారత నౌకాదళాలు సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. గాలింపులో భారత తీర రక్షక దళానికి చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా, ఐసీజీఎస్ వీర నౌకలు పాల్గొంటున్నాయి. అలాగే, 3 హెలికాప్టర్లతో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
ఈ చర్యలను విశాఖలోని రీజినల్ ఆపరేషన్స్ సెంటర్ (ఆర్వోసీ) పర్యవేక్షిస్తోంది. భారత నౌకాదళం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్సీ) కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యమై రెండు యుద్ధ నౌకలు, సీ కింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్హెచ్)ను మోహరించి గాలింపును కొనసాగిస్తోంది. ప్రస్తుతం సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేష¯Œన్ను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఫిషింగ్ హార్బర్లోని జేడీ కార్యాలయం వద్ద గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు సోమవారం బైఠాయించారు. తమ వారు ఏమయ్యారోనని ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సురక్షితంగా చేరుకున్న కారె చిన్నా
గల్లంతైన ఏడుగురిలో ఒక మత్స్యకారుడు సురక్షితంగా చైనాకు చెందిన ఓ వాణిజ్య నౌకను చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. సోమవారం సాయంత్రం ఎట్టకేలకు హెలికాఫ్టర్ ద్వారా రెస్క్యూ సిబ్బంది చైనా షిప్లో ఉన్న చిన్నా వద్దకు చేరుకున్నారు. నేవీ హెలికాప్టర్లోనే రాత్రి 7 గంటలకు చిన్నా.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నాడు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.


