
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోత
మరో 11 కేటగిరీ పోస్టులకు ఇంకా ఖరారు కావాల్సిన సంఖ్య
ఇప్పటికే తగ్గిన పోస్టుల్లో అత్యధికం మహిళా పోలీసులవే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా.. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ (మల్టీ పర్పస్) ఉద్యోగులుగా పేర్కొన్న 8 కేటగిరీల్లో ఏకంగా 11,489 పోస్టులకు కోత పెట్టేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీసుల కేటగిరీ ఉద్యోగుల విషయంలో ఏ సచివాలయంలో ఎవరుండాలి.. ఎవరు కొనసాగకూడదు అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. గ్రామ సచివాలయాల్లో సంబంధిత నాలుగు కేటగిరి ఉద్యోగులలో 9,201 పోస్టులు తగ్గిపోయాయి.
వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీసు కేటగిరీ ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ప్రక్రియ పూర్తి చేయగా.. అందులో 2,288 పోస్టులకు కోత పెట్టేశారు.
టెక్నికల్ కేటగిరీ ఉద్యోగుల కోసం ‘క్లస్టర్లు’
రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం నిర్ధారించిన నిబంధన ప్రకారం.. మిగిలిన 11 కేటగిరీల (టెక్నికల్) ఉద్యోగులను రెండు మూడు సచివాలయాలకు ఒకరు చొప్పున నియమించాల్సి ఉండడంతో, రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టరు వారీగా వర్గీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.
15,004 గ్రామ వార్డు సచివాలయాలను 7,600 దాకా క్లస్టర్లు వారీగా వర్గీకరించాలని జిల్లాల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిపాదనలు పంపారు. వర్గీకరణకు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్ల ఆమోదం అనంతరం, సచివాలయాల ఉద్యోగులలో కోతల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్లే..!
క్రమబద్దికరణ పేరుతో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులలోనే వేల మంది ఉద్యోగులను మిగులుగా తేల్చి, వారిని ఇతర శాఖల్లో అవసరాలకు ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవకాశాలే లేకపోవడంతో పాటు ఇప్పుడు సచివాలయాల్లో పనిచేసే మిగులు ఉద్యోగులనే ఇతర శాఖల్లో ఖాళీలకు ఉపయోగించుకోవడం కారణంగా ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తలుపులు క్లోజ్ అయినట్లేనని స్పష్టమవుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీరు జల్లే పరిస్థితి.

1.34 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిన జగన్ సర్కార్..
ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం, సంక్షేమ పథకం ఎటువంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సమర్థవంతంగా చేరవేసే ఉద్ధేశంతో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో మరో 3,842 వార్డు సచివాలయాలను మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు అప్పట్లో ఏర్పాటయ్యాయి.
ఒక్కో సచివాలయంలో 10– 11 మంది ఉద్యోగులు చొప్పున పనిచేసేలా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,49,235 మంది దాక పనిచేసేలా రూపకల్పన చేశారు. 15,004 సచివాలయాల్లో పనిచేసేందుకు.. అప్పట్లో గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలుగా పనిచేసే వారికి అదనంగా మరో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జూలైలోనే మంజూరు చేసి, కేవలం నాలుగు నెలల్లో భారీగా భర్తీ ప్రక్రియను సైతం పూర్తి చేసింది.