దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..! | Sakshi
Sakshi News home page

దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!

Published Wed, Apr 24 2024 1:00 AM

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP - Sakshi

ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్‌ డ్రైవర్‌. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన తిండికే సరిపోయేది కాదు. తల్లికి రూ.200 మాత్రమే వితంతు పింఛన్‌ వచ్చేది. భార్య ఎంఏ, బీఈడీ చదివింది. నాలుగురాళ్లు వెనకేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్నా... సర్కారు సహకారం కొరవడింది. ఇదీ గతంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటకు చెందిన వెన్నపూస ఓబిరెడ్డి కుటుంబ పరిస్థితి. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుంటూ నెట్టుకు వచ్చిన ఈ కుటుంబం నేడు వైఎస్సాసీపీ ప్రభుత్వ సహకారంతో సుఖసంతోషాలతో జీవిస్తోంది. – అనంతపురం  

2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లు వేస్తే డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా ప్రతినెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలతో ఓబిరెడ్డి కుటుంబం గంపెడు ఆశలు పెట్టుకుంది. తీరా ఆయన  డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. వారి హామీతో మూడు నెలలు అప్పు కట్టలేదు. నెలనెలా వడ్డీ పెరుగుతోందని బ్యాంకు సిబ్బంది హెచ్చరిస్తూ వచ్చేవారు. ఒకవేళ మాఫీ చేసినా..మీరు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇస్తామని, మాఫీ చేయకపోతే వడ్డీ మీ నెత్తిన పడుతుందని చెప్పారు.

దీంతో సభ్యులంతా మాట్లాడుకుని అప్పు కడుతూ వచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారమంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అదికూడా మాఫీ కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ నాలున్నరేళ్లలో మొత్తం రూ.7,36,000 మేరకు ఆర్థిక సహాయాన్ని పొందారు. వైఎస్సార్‌ ఆసరా కింద భార్యకు రూ.44 వేలు వచ్చింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ఇంటి పెద్ద కన్నుమూయగా వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష వచ్చింది. యానిమేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్‌ వస్తోంది. ఇప్పుడు తమ కుటుంబం ఆనందంగా గడుపుతోందని ఓబిరెడ్డి ప్రమీల చెప్పారు.

‘సంక్షేమం’ లేకుండా సుస్థిరాభివృద్ధి  అసాధ్యం  
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని  విధంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. వీటిద్వారా సగటు మానవుని జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి.    – గుర్రం జయపాల్‌రెడ్డి, జెడ్పీ రిటైర్డ్‌ సీఈఓ

ఓబిరెడ్డి కుటుంబానికి కలిగిన లబ్ధి ఇలా...
పథకం                     టీడీపీలో         వైఎస్సార్‌సీపీలో 
డ్వాక్రా రుణమాఫీ   00                   రూ.44 వేలు 
పింఛన్‌                   రూ.62,000      రూ.1.89 లక్షలు 
ఆరోగ్యశ్రీ                  00                   రూ.60 వేలు 
వైఎస్సార్‌బీమా        00                   రూ.1 లక్ష 
సున్నా వడ్డీ              00                   రూ.8 వేలు 
విద్యా దీవెన             00                   రూ.25 వేలు 
వసతి దీవెన             00                   రూ.15 వేలు 
అమ్మ ఒడి                00                   రూ.55 వేలు 
నిరుద్యోగ భృతి       రూ.4 వేలు     00 
యానిమేటర్‌             00                  రూ.2.40 లక్షలు 

Advertisement
Advertisement