సెలక్షన్.. అంతా కలెక్షన్! | Irregularities in the recruitment of DSC sports quota posts have created a sensation across the state | Sakshi
Sakshi News home page

సెలక్షన్.. అంతా కలెక్షన్!

Jun 4 2026 4:33 AM | Updated on Jun 4 2026 4:33 AM

Irregularities in the recruitment of DSC sports quota posts have created a sensation across the state

క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీలో ప్రతిభకు పాతర

జాబితా మొత్తం జల్లెడ పట్టినా కనిపించని మెరిట్‌

ఇంటర్‌ డిస్ట్రిక్ట్, వర్సిటీ వార్షిక మీట్, ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు 

అత్యంత స్వల్పంగా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఉద్యోగం

382 మందిలో పతకాలు సాధించిన వారి సంఖ్య అతి స్వల్పం 

సాఫ్ట్‌బాల్‌లో 38, జూడోలో 39, బాల్‌ బ్యాడ్మింటన్‌లో 48, ఖోఖోలో 49 మందికి ఉద్యోగాల్లో 90 శాతం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లకే!

జాతీయ స్థాయిలో గుర్తింపు లేని క్రీడా సంఘాల నుంచి జెన్యూనిటీ సర్టిఫికెట్‌ తీసుకున్న ప్రభుత్వం 

ఇప్పటికీ 2 వేల మంది మెరిట్‌ జాబితాను బయటపెట్టని సర్కార్‌

డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో సాఫ్ట్‌బాల్‌ విభాగంలో 38 పోస్టులు భర్తీ చేశారు. వీటిల్లో అత్యధికంగా 18 పోస్టుల వరకు కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లకు ఇచ్చేశారు. ఆ తర్వాత నేషనల్‌ గేమ్స్‌ సర్టిఫికెట్‌తో ఆరు మందికి పోస్టులు దక్కాయి. మిగిలినవి సౌత్‌ జోన్‌ చాంపియన్‌ షిప్, సీనియర్‌ నేషనల్స్, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌కు కట్టబెట్టేశారు. ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ 38 మంది క్రీడా సర్టిఫికెట్లలో ఆరింటికి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయి. మిగిలిన వాటికి సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ), ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జెన్యూనిటీ నిర్ధారించాయి. 

జెన్యూనిటీని నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ (మయాస్‌), ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)లో కచ్చితంగా గుర్తింపు ఉండాలి. కానీ, కొన్నేళ్లుగా ఎస్‌ఏఐకు మయాస్‌లో గానీ, ఐఓఏలో గానీ గుర్తింపు లేదు. ఎస్‌ఏఐపై దేశ వ్యాప్తంగా క్రీడాకారులు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ, ఎస్‌ఏఐ తమకు తాము ఐఓఏ గుర్తించినట్టు ప్రకటించుకోడంపై ఐఓఏ లీగల్‌ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకే గుర్తింపు లేనప్పుడు రాష్ట్రంలోని సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌కు ఎలా గుర్తింపు వచ్చింది? 

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్లు ఇచ్చిన జెన్యూనిటీని రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ ఎలా అంగీకరిస్తుంది? ఇందులో దొంగ సర్టిఫికెట్లు లేవని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అనంతపురంలో 2021-22లో సాఫ్ట్‌బాల్‌ నేషనల్స్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో ఆడకుండానే సర్టిఫికెట్టు తెచ్చుకుని, న్యాయస్థానంలో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఇప్పటికీ కేసులు నడవట్లేదా? ఇందులో శాప్‌ అధికారులు 2024 సెప్టెంబర్‌లో ముందుగా సర్టిఫికెట్‌ను ధ్రువీకరించి.. ఆ తర్వాత కాదని కోర్టుకు చెప్పలేదా? అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఇందులో పారదర్శకత ఎక్కడుంది? టీడీపీ ఎమ్మెల్యే ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉండటమే అన్నింటికంటే పెద్ద అర్హతా?

జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో 23 మందికి కేవలం ఇంటర్‌ డిస్ట్రిక్ట్, స్టేట్‌ మీట్‌ సర్టిఫికెట్లకు పోస్టులు వచ్చేశాయి. వారు రాష్ట్రం దాటి వెళ్లలేదు. మరో 16 మందికి ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ, స్టేట్‌ మీట్‌లో కేవలం పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌కు సైతం పోస్టులు ఇచ్చేశారు. ఇందులో పీఈటీ, పీడీ పోస్టులు కాదు ఏకంగా స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ కింద బోధన పోస్టులు ఇచ్చేశారు. 

ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు లేరా? అత్యంత దారుణంగా జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహించిన వారికి పతకం రాకపోయినా పాల్గొంటే చాలని ఉద్యోగాలు ఇచ్చేస్తారా? జిల్లా స్థాయిలో ఆడటమేనా క్రీడా మెరిట్‌? పైగా 2018 నవంబర్‌లో నిర్వహించిన సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూడో చాంపియన్‌ షిప్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు.. తాజాగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులకు పొంతనే లేదు. ఒరిజినల్‌ రిజల్ట్‌ లిస్టులోని వ్యక్తుల స్థానంలో కొత్తవారు వచ్చి ఉద్యోగాలు పొందారు.

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీ అక్రమాలను సెలక్షన్‌ లిస్టు మరింత బలపరుస్తోంది. డీఎస్సీ నియామకాలు ముగిసిన ఎనిమిది నెలల తర్వాత ఫైనల్‌ సెలక్షన్‌ లిస్టును రెండు రోజుల కిందట ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బయట పెట్టింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టోర్నీలో పాల్గొన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం కట్టబెట్టేసింది. పతకంతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇచ్చి ‘మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ కోటా’(ఎంఎస్‌క్యూ)కు సరికొత్త అర్థం చెప్పింది. దాదాపు 24 ఏళ్ల కిందట సర్టిఫికెట్లు ఉన్న వారికి రాత పరీక్ష లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయులుగా నియమించడం సర్వత్రా విస్తుగొలుపుతోంది.

విచిత్రంగా ఇంటర్‌ డిస్ట్రిక్ట్, ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ వార్షిక క్రీడా పోటీల్లో పాల్గొన్న సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కడం క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 382 పోస్టులను భర్తీ చేసింది. ఫైనల్‌ లిస్టులో 36 క్రీడాంశాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. పదికిపైగా పోస్టులతో నింపిన 14 క్రీడాంశాల్లో మొత్తం 308 పోస్టులను భర్తీ చేస్తే.. ఇందులో కేవలం నాలుగు క్రీడాంశాల్లో 174 పోస్టులు నింపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, మిగిలిన 22 క్రీడాంశాల్లో భర్తీ చేసినవి కేవలం 74 పోస్టులు మాత్రమే. 

ఇలా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన 382 మంది జాబితాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వేళ్లపై లెక్కపెట్టొచ్చంటే ఎంత దారుణంగా నియామకాలు చేశారో అర్థమవుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర యువ­జన సర్వీసుల శాఖ (మయాస్‌), ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)లో గుర్తింపు లేని సంఘాలు, కోర్టు కేసుల్లో ఉన్న సంఘాల నుంచి క్రీడా సర్టిఫికెట్ల జెన్యూనిటీ తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గపు విధానాలను అవలంభిస్తున్నట్టు స్పష్టమవు­తోంది. 

మెరిట్‌కు అర్థం మార్చేసిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ నియామకాలు చేసినట్టు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వల్లెవేస్తోంది. దేశ చరిత్రలో పతకాలు సాధించిన వారిని కాదని పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోయినా, ఏపీ క్రీడా కోటా డీఎస్సీలో మాత్రం 90 శాతం పార్టిసిపేషన్, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఇందుకు తగ్గట్టుగా క్రీడా పాలసీ రూపకల్పనలోనే దీనికి బీజం పడింది. 

ఒలింపిక్‌ మొదలకొని ఏషియన్‌ గేమ్స్, వరల్డ్‌కప్‌ (4ఏళ్లు), కామన్‌ వెల్త్, నేషనల్‌ గేమ్స్, నేషనల్‌ చాంపియన్‌షిప్, ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్‌/యూత్‌ గేమ్స్‌/ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ చాంపియన్‌ షిప్, సౌత్‌ జోన్‌ చాంపియన్‌ షిప్, జోనల్‌ ఇంటర్‌ వర్సిటీ చాంపియన్‌షిప్, స్టేట్‌ చాంపియన్‌ షిప్‌ల ద్వారా వరుస క్రమంలో పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. వీటిల్లో పతకాలతో పాటు పార్టిసిపేషన్‌ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. 

ఇలా 12 స్థాయిల్లో క్రీడా అర్హతల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఇంటర్‌ డిస్ట్రిక్ట్, స్టేట్‌ చాంపియన్‌ షిప్‌లో అత్యధికంగా పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లకే ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జాతీయ స్థాయిలో పతకం గెలిచిన క్రీడాకారులందరూ ఏమైపోయారు? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నేషనల్‌ చాంపియన్‌ షిప్‌లకు ప్రాధాన్యం ఇస్తే.. ఇక్కడ నేషనల్‌ గేమ్స్‌ను ముందు వరుసలో ఎందుకు పెట్టారు? అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 

65 క్రీడాంశాలను ఎందుకు విభజించారు?
కేంద్ర ప్రభుత్వ క్రీడా విధానాల ప్రకారం 65 క్రీడాంశాలను పెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రంలో 65 క్రీడాంశాలను రెండుగా విభజించలేదు. ఏపీలో మాత్రం విభజించారు. 65లో రెండు, మూడు క్రీడలను మార్చి.. ‘మాస్టర్‌ మైండ్‌’ (శాప్‌లో పెద్ద తలకాయ తనకు తానుగా పెట్టుకున్న పేరు) సొంతంగా క్రీడలను చేర్చారు. ఇలా ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 పోస్టులను ఎందుకు విభజించారో చెప్పలేదు. ఏ–కేటగిరీలో స్టేట్, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ సర్టిఫికెట్‌ ఉంటే ఉద్యోగం ఇవ్వగా.. బీ–కేటగిరీలో జాతీయ స్థాయిలో పతకం సాధించిన వారికి ఉద్యోగాలు దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

రాత పరీక్షకు కూడా హాజరు కాని వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు కొట్టేశారు. ఆ తర్వాత తీరిగ్గా జీవోను సవరించారు. క్రీడా కోటా 3 శాతం హారిజాంటల్‌ రిజర్వేషన్‌లో పోస్టు పొందాలంటే కచ్చితంగా డిపార్ట్‌మెంట్‌ పెట్టే రాత పరీక్ష రాయాలని పేర్కొనడం దోపిడీకి సాక్ష్యంగా నిలుస్తోంది. చిత్తురు జిల్లా స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్లతో భారీ అవకతవకలు జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

క్రీడా ట్రయల్స్‌ ఎందుకు పెట్టలేదు?
కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు క్రీడా కోటాలో ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో కచ్చితంగా క్రీడా ట్రయల్స్‌ నిర్వహిస్తాయి. అందులో ప్రతిభను చూసి పోస్టులకు ఎంపిక చేస్తాయి. కానీ, డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో ఎక్కడా రాత పరీక్ష లేకపోగా, కనీసం క్రీడా ట్రయల్స్‌ను నిర్వహించక పోవడం గమనార్హం. తాజాగా హైకోర్టు సైతం డీఎస్సీకి సంబంధించిన కేసులో సర్టిఫికెట్‌ నిర్ధారణకు సాఫ్ట్‌బాల్‌లో ట్రయల్స్‌ పెట్టమని ఆదేశించింది. 

20– 24 ఏళ్ల కిందటి క్రీడా సర్టిఫికెట్లతో..అది కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బాల్‌ బ్యాడ్మింటన్‌లో 48 పోస్టులు భర్తీ చేస్తే 34 పైగా, ఖోఖో 49కి గాను 24కుపైగా, హ్యాండ్‌బాల్‌ 18 పోస్టులు ఉంటే 14 పోస్టులకుపైగా పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో ఇచ్చేశారు. ఫొటోలు, మెడల్స్‌ను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు.

సారూ.. వీటినేమంటారు?
» అనంతపురంలో వాలీబాల్‌/బీచ్‌ వాలీబాల్‌లో ఓ క్రీడాకారుడికి ఎస్‌ఏ హిందీ పోస్టు వచ్చింది. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్‌ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్‌ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్‌ జోన్‌ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్‌ చేసిన సర్టిఫికెట్‌తో డీఎస్సీ ఉద్యోగం దక్కింది.

»  చిత్తూరు జిల్లాలో హ్యాండ్‌ బాల్‌ కోటాలో ఓ మహిళకు ఎస్‌ఏృజీవశాస్త్రం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆమె 6వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌  హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ (2021 మార్చి 5-7)లో పార్టిసిపేట్‌ చేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన 49వ సీనియర్‌ ఉమెన్‌ నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ (2021 మార్చి17-21)లో పార్టిసిపేట్‌ చేసిన సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందింది. ఇక్కడ 6వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ మీట్‌కి.. అదే ఏడాది 49వ సీనియర్‌ ఉమెన్‌ నేషనల్‌ మీట్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తోంది.

»  పశ్చిమగోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఓ మహిళకు ఎస్‌ఏృఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉద్యోగం వచ్చింది. ఆమె 2022 డిసెంబర్‌ 13-22 మధ్య హైదరాబాద్‌లో జరిగిన 32వ నేషనల్‌ గేమ్స్‌లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికెట్‌ చూపించారు. దీనికి తోడు 2001లో డిసెంబర్‌ 19-23 మధ్య పుణెలో 37వ సీనియర్‌ నేషనల్‌ ఖోఖో చాంపియన్‌ షిప్‌లో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ పొందు­పరిచారు. వాస్తవానికి 2022 సెప్టెంబర్‌లోనే గుజరాత్‌లో 36వ నేషనల్‌ గేమ్స్‌ జరిగాయి. ఈ లెక్కన ఏది నిజం? సదరు క్రీడాకారిణి జెన్యూనిటీ పరిశీలించారా?  

»  చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్‌ విభాగంలో ఓ మహిళకు ఎస్‌ఏృఇంగ్లిష్‌ పోస్టు వచ్చింది. సదరు క్రీడాకారిణికి ఇంటర్‌ వర్సిటీ సౌత్‌ జోన్‌ (2008-09)లో పార్టిసిపేట్‌ చేసిన సర్టిఫికెట్‌తో ఉద్యోగం ఇచ్చారు. 2008-09లో తిరుచ్చిలో ఇంటర్‌ వర్సిటీ సౌత్‌ జోన్‌ టోర్నీలో బాల్‌ బాడ్మింటన్‌లో పాల్గొన్నట్టు బ్యాకప్‌ సర్టిఫికెట్‌ చూపించారు. అసలు బ్యాడ్మింటన్‌లో బ్యాకప్‌ సర్టిఫికెట్‌ చూపించాలి కదా?

» చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్‌జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమె 2019-20లో తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్‌ మీట్‌లో పార్టిసిపేట్‌ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది శ్రీకాకుళం అంబేడ్కర్‌ వర్సిటీలో సౌత్‌జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్‌ చేసిన సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందారు. ఇక్కడ అండర్‌ ఏజ్, సీని­యర్‌ చాంపియన్‌ షిప్‌లలో పాల్గొనకుండానే ఉద్యోగం వచ్చేసింది.

» తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్‌ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్‌జీటీ ఉద్యోగం వచ్చింది. ఆమెకు 2006 అక్టోబర్‌లో 7వ సీనియర్‌ స్టేట్‌ ఉమెన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌(విశాఖ)లో 2వ స్థానం దక్కింది. అంతకు ముందు ఆమె గెలిచిన ఒక్క పతకానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికెట్లు పొందుపరచలేదు. జూనియర్‌ స్థాయిలో ఆడకుండానే సీనియర్‌ చాంపియన్‌ షిప్‌కు వెళ్లిపోయారా?

Advertisement
 
Advertisement
Advertisement