ప్రియుడితో దొరికిన భార్య.. గొంత కోసి హతమార్చిన భర్త.. | husband and wife incident | Sakshi
Sakshi News home page

ప్రియుడితో దొరికిన భార్య.. గొంత కోసి హతమార్చిన భర్త..

Jan 22 2026 8:17 AM | Updated on Jan 22 2026 8:17 AM

husband and wife incident

అనంతపురం సెంట్రల్‌: భార్య ప్రవర్తన నచ్చని భర్త చివరకు ఆమె గొంతు కోసి హతమార్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం వన్‌టౌన్‌ పీఎస్‌ పరిదిలోని యల్లమ్మ కాలనీలో నివాసముంటున్న వీరాంజనేయులు, లక్ష్మీ గంగ (30) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరాంజనేయులు బేల్దారి పనులకు వెళుతుండగా...  లక్ష్మీగంగ ఇంట్లోనే చీరల వ్యాపారంతో పాటు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో  ఉన్న ఓ డెయిరీలో పనిచేస్తోంది. కొంత కాలంగా భార్య మరో యువకుడితో చనువుగా ఉన్న విషయాన్ని భర్త గమనించాడు. ఈ విషయంగా పలుమార్లు భార్యకు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. అంతేకాక ఇంటి నుంచి వెళ్లి పోయింది. 

దీంతో వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు స్పందించి రెండు రోజుల క్రితం లక్ష్మీ గంగను పీఎస్‌కు పిలిపించి దంపతులిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు. మంగళవారం పొద్దుపోయాక దంపతులిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున గాఢ నిద్రలో ఉన్న భార్య గొంతను కొడవలితో కోసి హతమార్చిన అనంతరం వీరాంజనేయులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. అయితే తాగుడుకు బానిసైన వీరాంజనేయులు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడలేదని, ఇందులో మరొకరి సాయం కూడా ఉందని హతురాలు లక్ష్మీ గంగ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.  

అనుమానం పెనుభూతమై..  
రాయదుర్గం టౌన్‌:   భర్తే కాలయముడిగా మారి భార్యను హతమార్చిన ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక ముత్తరాసి కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమార్తె కుళ్లాయమ్మ (45)కు పాతికేళ్ల క్రితం అనంతపురానికి చెందిన మారెన్నతో వివాహమైంది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని మారెన్న పోషించుకునేవాడు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు.  

తరచూ గొడవనే 
బంగారం లాంటి ఇల్లాలు, రత్నాల్లాంటి బిడ్డలు ఉన్నప్పటికీ.. మూడు నెలలుగా కుళ్లాయమ్మ ప్రవర్తనపై మారెన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ ఆమెతో గొడవ పడేవాడు. భార్య ఎంత నచ్చచెబుతున్నా వినేవాడు కాదు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె రాయదుర్గంలోని తన పుట్టింటికి చేరుకుంది. దీంతో మంగళవారం రాత్రి మారెన్న కూడా రాయదుర్గానికి వచ్చాడు. మారెన్నలో మార్పు వచ్చిందని అత్తింటి వారు సంతోష పడ్డారు. అల్లుడికి రాచమర్యాదలే చేశారు. అనుమానాలు వీడి కుమార్తెను చక్కగా చూసుకోవాలని హితవు పలికారు. ఆ రోజు రాత్రి మారెన్న తన భార్యతో కలసి ఆమె     ఇంట్లోనే నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కుళ్లాయమ్మను కదిపి చూశాడు. ఆమె కూడా గాఢ నిద్రలో ఉన్నట్లుగా నిర్ధారించుకున్న అనంతరం మచ్చుకత్తి తీసుకుని తలపై నరికి అక్కడి నుంచి పరారయ్యాడు.  

చికిత్స పొందుతూ...  
ఇంటి తలుపులు తీసిన శబ్ధానికి కుళ్లాయమ్మ కుటుంబసభ్యులు మేల్కొన్నారు. అల్లుడు హడావుడిగా బయటకు వెళుతుంటే వారికి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత కుమార్తె గదిలోకి వెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న కుళ్లాయమ్మను గమనించి అల్లుడు ఎంత పనిచేశాడంటూ ఆక్రోశం వెళ్లగక్కుతూ ఆగమేఘాలపై 108 అంబులెన్స్‌లో రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కుళ్లాయమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం అర్బన్‌ సీఐ జయనాయక్, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్యకు గల కారణాలను బాధిత కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మారెన్న కోసం గాలింపు చేపట్టారు.  

మద్యం మత్తులో స్నేహితుడి హత్య 
అనంతపురం సెంట్రల్‌: మద్యం మత్తు ప్రాణస్నేహితుల మధ్య చిచ్చురేపి ఒకరి హత్యకు కారణమైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని కోవూరు నగర్‌కు చెందిన అతావుల్లా (34), అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అల్లాబకాష్‌ మంచి స్నేహితులు. మంగళవారం రాత్రి ఇద్దరూ కలసి రామ్‌నగర్‌లో మద్యం సేవించి చిన్న పాటి విషయానికి గొడవ పడ్డారు. ఆ సమయంలో అల్లాబకాష్‌ బండరాయితో దాడి చేయడంతో అతావుల్లా కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెవి నుంచి భారీగా రక్తస్రావం కావడంతో పాటు చికిత్సకు స్పందించక బుధవారం తెల్లవారుజామున అతావుల్లా మృతి చెందాడు. హతుడు అవివాహితుడు. అతావుల్లా సోదరుడు కరీముల్లా ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి అల్లాబకాష్‌ కోసం గాలిస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్‌ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement