ఘ‌నంగా జాషువా జ‌యంతి వేడుక‌లు

Gurram Jashuva Jayanthi Celebrations Held At YSRCP Office Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో 125వ‌ గుర్రం జాషువా జ‌యంతి వేడుక‌లు సోమవారం ఘ‌నంగా నిర్వ‌హించారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి  పాల్గొన్నారు.  

ప్ర‌తిప‌క్షాలు కుల‌రాజ‌కీయాలు చేస్తున్నాయి
ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూల‌పు సురేష్ మాట్లాడుతూ.. 'గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. త్వ‌ర‌లోనే జాషువా కళా ప్రాంగణ నిర్మాణాన్ని ప్రారంభిస్తామ‌ని పేర్కొన్నారు. సమాజ హితం కోసం జాషువా  ఎన్నో రచనలు చేశారు. జాషువా సమాధిని స్మృతి వనంగా అభివృద్ధి చేస్తాం.జాషువా ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కులాలను అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేస్తున్నాయి' అని పేర్కొన్నారు.  దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రి తిప్పికొట్టారు. త‌మ‌ది  ద‌ళితుల‌ను గౌర‌వించే ప్ర‌భుత్వం అని పేర్కొన్నారు. గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసున‌న్నారు. ద‌ళిత స‌మాజికి వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తూ సుచ‌రిత‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చిన ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని, దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి  వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.

నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి జాషువా అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుకే పరిమితం కాకూడదని సీఎం జగన్ పోరాడుతున్నారని తెలిపారు. దళితులపై దాడులు అంటూ ప్ర‌తిప‌క్షాలు కొత్త రాజకీయం తెర మీదకు తెస్తున్నార‌ని, వారి కుల రాజ‌కీయాలు చెల్ల‌వ‌ని వ్యాఖ్యానించారు. (బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్‌ సమావేశం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top