బాబు ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్‌ సమావేశం

TJR Sudhakar Babu Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు పంపిన స్క్రిప్ట్‌తో చిలుకపలుకులు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

సాక్షి, అమరావతి: విజయవాడలో జైభీమ్‌ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశం ఎవరి ఆత్మగౌరవం నిలబెట్టిందో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దళిత నేతలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ప్రశ్నించారు. దళిత మేధావుల పేరుతో హర్షకుమార్, శ్రావణ్‌ నిర్వహించిన సమావేశంలో దళిత నేతలందరూ చంద్రబాబు స్క్రిప్ట్‌నే చదివారని మండిపడ్డారు. బాబు తన చిలుకపలుకులనే వారితో పలికించారని విమర్శించారు. సుధాకర్‌బాబు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

► రౌండ్‌టేబుల్‌ సమావేశం దళిత ద్రోహి చంద్రబాబు భజన కోసం ఏర్పాటు చేసినట్లు ఉంది. 
► దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు, ఆదినారాయణరెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు దళితులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. దళిత నాయకులు రౌండ్‌టేబుల్‌ సమావేశాలు పెట్టి చంద్రబాబును ఛీ కొట్టాల్సింది. అప్పుడెందుకు వారు ఆ పని చేయలేకపోయారో చెప్పాలి. 
► బాబు హయాంలో దళితుల మీద, దళిత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసినప్పుడు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరేం మేలు చేశారో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం.
► చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. బాబు భజన బృందం దళితవాడల్లో కాలుపెడితే దళితులే బుద్ధి చెబుతారు.
► చంద్రబాబు దళితులను వైఎస్సార్‌సీపీకి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారు. 
► సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ నడిబొడ్డున బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. దళిత సంక్షేమానికి ఆయన పెద్దపీట వేశారు. 
► హర్షకుమార్‌ స్వలాభం కోసం చంద్రబాబు కాళ్ల మీద పడి దళితుల ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేశారు. 
► దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top