
ఏపీ స్టడీ సర్కిల్ నిర్వీర్యం
ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు కూటమి సర్కారు దగా
యూపీఎస్సీ, గ్రూపు–1, 2లకు దక్కని శిక్షణ
వైఎస్సార్ సీపీ హయాంలో మూడు ధపాలు సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ
గత ప్రభుత్వ ప్రోత్సాహంతో పలువురు అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు సర్కారు ఉద్యోగాలు కాదు కదా.. కనీసం నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఏపీ స్టడీ సర్కిల్ మనుగడనే కూటమి సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది. యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 శిక్షణ తరగతులను పూర్తిగా ఎత్తి వేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ అందకుండా పోయింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ స్టడీ సర్కిల్కు పునరుజ్జీవం కల్పించింది.
మన రాష్ట్రానికి చెందిన యువత కోసం విశాఖలో ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. రుషికొండ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి సుమారు రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవనాన్ని 2021లో నిరి్మంచింది. పరిపాలన భవనంతో పాటు వసతి గృహానికి సంబంధించి రెండు భవనాలను జీ+2 విధానంలో అందుబాటులోకి తెచి్చంది. గత ప్రభుత్వం వరుసగా మూడేళ్ల పాటు ఈ కేంద్రంలో సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించగా పలువురు ఉద్యోగాలు కూడా సాధించారు.
నిరుద్యోగుల పడిగాపులు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ స్టడీ సర్కిల్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ తరగతులను నిలిపివేసింది. 2024–25లో సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం వందల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ స్టడీ సర్కిల్స్ స్టూడెంట్స్ ఫోరం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు.
ఉద్యమించేందుకు సన్నద్ధం..
ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు మొత్తుకుంటున్నా ఆలకించని కూటమి సర్కారు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సాధారణ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని చెబుతోంది. సివిల్స్, గ్రూప్స్ శిక్షణకు అవకాశం కల్పించకుండా కేవలం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు ఇటీవల దరఖాస్తులు ఆహా్వనించింది.
అది కూడా ప్రిలిమ్స్ కాకుండా కేవలం మెయిన్స్ మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్ను నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.
వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి..
తక్షణమే ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందే స్థోమత లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. – కొల్లు ఆనంద్కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ ఫోరం