
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న ‘మనబడి నాడు–నేడు’ పథకాన్ని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించింది. సుమారు రూ.500 కోట్లతో ఆయా కేంద్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్య, క్రీడా పరికరాలను అందజేయనుంది. ప్రధాన మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలకు రంగులు, కిచెన్ షెడ్లు, ఫర్నీచర్, పిల్లలకు ఆటవస్తువులను అందుబాటులోకి తీసుకొస్తారు.
మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో 50,600 కేంద్రాలను నాడు–నేడులోకి తీసుకున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్నవాటిలో 600 కేంద్రాల్లో ఇప్పటికే నాడు–నేడు పనులు పూర్తిచేశారు. మరో 1,778 కేంద్రాల్లో సదుపాయాలు కల్పించారు. కొత్తగా 1,625 భవనాలను నిర్మించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశంలో అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అందులో భాగంగా విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.