ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు  | Sakshi
Sakshi News home page

ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు 

Published Sat, Apr 13 2024 4:09 AM

Government colleges have better results than corporate colleges - Sakshi

కార్పొరేట్‌ కళాశాలలను మించి అత్యుత్తమ ఫలితాలు 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ చర్యలే కారణమంటున్న విద్యావేత్తలు 

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌:  ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేసి వాటిలో ఇంటర్మీడియెట్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీపప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంటర్మీడియెట్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్‌ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు.  

టాపర్‌గా తహురా
అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్‌ రియాజ్‌ అలీ, షేక్‌ నూర్‌భాను కుమార్తె షేక్‌ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్‌గా నిలిచింది.  

♦  కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జనరల్‌ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్‌.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్‌గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్‌ విద్యార్థి నులు 87.5 శాతం     ఉత్తీర్ణత సాధించారు.  

♦   పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్‌ ఫస్టియర్‌ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్‌ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది. 

♦    ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి హెచ్‌.అజయ్‌ రాజు సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఎస్‌. కళ్యాణి ఎంఎల్‌టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి. 

♦    చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కు­లతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలల విద్యార్థు­లు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు.   

ఏపీ మోడల్‌ స్కూల్స్‌ అదుర్స్‌..  
ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్‌ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్‌ స్కూల్స్‌ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

అలాగే ఇంటర్‌ సెకండియర్‌ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్‌ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి.   

కేజీబీవీలు కేక 
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్‌ విద్యార్థి ని జి.విజయలక్ష్మి(ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌లో యు.మానస 495, కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.యమున 494, ఎస్‌.హజీరాభాను 490 మార్కులు సాధించారు.  

సెకండియర్‌ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు.    

హైస్కూల్‌ ప్లస్‌ల్లో పెరిగిన ఉత్తీర్ణత 
రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్‌లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు.   

బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్‌గా.. 
కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్‌ ఫస్టియర్‌ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్‌.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది.

ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్‌ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.
 
ఆదిత్య ప్రతిభ 
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 465 మార్కులు ఏడుగురు, 464 మార్కులు 20 మంది పొందారని పేర్కొన్నారు.

బైపీసీలో 435, 434 మార్కులు, ఎంఈసీలో 489 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్‌ ఎంపీసీలో 990, 989, బైపీసీలో 986, ఎంఈసీలో 978 మార్కులు పొంది తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సతీ‹Ùరెడ్డి, కో–ఆర్డినేటర్‌ లక్ష్మీకుమార్, డైరెక్టర్లు గంగిరెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్‌ మెయినా అభినందించారు.  

శ్రీచైతన్య విజయకేతనం 
విజయవాడ: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో చింటు రేవతి రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు గాను టి.దివ్య రాష్ట్రస్థాయిలో 436 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే సీనియర్‌ ఎంపీసీలో ఎ.వి.దుర్గామధులిక 1000 మార్కులకు గాను 992 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చారని తెలిపారు. అలాగే బైపీసీలో ఎస్‌.పావని 991 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ సాధించినట్లు చెప్పారు. 

శ్రీప్రకాష్‌ విజయభేరి 
తుని: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో శ్రీప్రకాష్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ ఏడాది విద్యార్థి ని టి.వెన్నెల 982/1000, డీడీ సాయి శ్రీనివాస్‌ 980/1000, బైపీసీలో కె.లాస్య నందిని 979/1000 మార్కులతో అగ్రస్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం డీవీఎల్‌ సాయి నిహారిక 464/470, ఎస్‌.మేఘన 463/470, బైపీసీలో జి.వర్షిణి 428/470 మార్కులు పొందారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్‌ అభినందించారు.
 
నారాయణ జయకేతనం 

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలి­పారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470 మార్కు­లకు గాను పి.మేఘన 467, కె.ప్రసన్న 466 మార్కులు పొందారని పేర్కొన్నారు.  బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు 14 మంది సాధించారని తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 991, 991 టాప్‌ మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీలో 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు.
 
సత్తా చాటిన శశి 
ఉండ్రాజవరం: ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యా­ర్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యా సంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ శుక్రవారం తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఎం.నవ్యశ్రీ 990, బి.పార్వతి, కె.లిఖిత 989 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కేఎస్‌ సాయి శివాని 987, ఎండీ అబ్దుల్‌ జాఫర్‌ 985 మార్కులు పొందారని తెలిపారు.

జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470 మార్కు­లకు గాను ఎం.లీలాకృష్ణారెడ్డి, డి.దుర్గా కౌసల్య 466, ఎస్‌కే ఇర్పాత్, బి.సహస్ర, బి.షన్మి­త, టి.మనోజ్ఞ 465 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు టి.కీర్తి, పీవీ హసని, వి.ఖ్యాతి, ఎం.నిస్సి, సీహెచ్‌ తేజస్వి 435 మార్కులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు.  

తిరుమల విద్యాసంస్థల ప్రభంజనం 
రాజమహేంద్రవరం రూరల్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 470కి 466 మార్కులు 12 మంది సాధించారని చెప్పారు. బైపీసీలో 440కి 436 మార్కులు నలుగురు తెచ్చుకున్నారని తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఇద్దరికి 990 మార్కులు వచ్చాయని తెలిపారు. బైపీసీలో 1000 మార్కులకు గాను నలుగురు 989 మార్కులు పొందారని నున్న తిరుమలరావు వివరించారు.  

‘విజ్ఞాన్‌’ విజయభేరి 
చేబ్రోలు: ఇంటర్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్‌ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో  ప్రిన్సి­పాల్స్‌ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు తెలిపారు.

ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.లీలావతి (989), జి.వైశాలి (988), ఎం.స్నేహ  (987), ఎస్కే.మీరావలి (987), కె.వంశీక్రిష్ణ (987), టి.సంజయ్‌ తేజ (986), సీహెచ్‌ మనస్వి (986), టి.సంజయ్‌ తేజ (986) మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో  వి.కౌశిక్‌ (466), జీవీఏ తేజస్వి(464), వై.పార్థసారథి(464), జె.హేమంత్‌ సందీప్‌(464), కె.విష్ణువర్ధన్‌(464), ఆర్‌.శ్రీకాంత్‌(464), ఎం.అఖిలేష్‌ (464), ఎం.హర్ష వర్ధన్‌(464) మార్కులు సాధించారని చెప్పారు.   

సత్తా చాటిన భాష్యం  
గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్‌ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం. హేమ ప్రియ హాసిని, జి సాయి మనోజ్ఞ 470 మార్కులకు 466 సాధించారని పేర్కొన్నారు.

సీనియర్‌ ఎంపీసీ విభాగంలో జి.చంద్రలేఖ్య వెయ్యి మార్కులకు గాను 990 మార్కులు, బి.అభిజ్ఞ, ఎం.లహరి పి.సాయి మనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించినట్లు చెప్పారు. జూనియర్‌ బైపీసీలో భాష్యం మెడెక్స్‌ విద్యార్థులు ఎల్‌.నవ్య, షేక్‌ నసీమా 440కి 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సీనియర్‌ బైపీసీలో ఎం.హాసిని లాలిత్య, ఇంటూరి యోషిత వెయ్యి మార్కులకు 985,  శ్రీషా 984 మార్కులు సాధించినట్లు తెలిపారు.

శ్రీగోసలైట్స్‌ విద్యార్థుల ప్రతిభ 
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్‌ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థి ని ఆలూరు కిరణ్మయి 990/1000 మార్క్‌లతో రాష్ట్రంలో సెకండ్‌ టాప్, కృష్ణాజిల్లాలో సెకండ్‌ టాప్‌లో నిలిచింది.

అలాగే  జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థి ని ఇంజమూరి హరిచందన 435/440 మార్కులతో రాష్ట్రంలో సెకండ్‌ టాప్‌లో, కృష్ణాజిల్లాలో సెకండ్‌ టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గోసలైట్స్‌ చైర్మన్‌ నరేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
 
శ్రీవిశ్వశాంతి విజయం 
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిశ్వశాంతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా 988, 984, 984, 982, 982, 981 మార్కు­లను  సాధించారు.  

అదే విధంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 465, 464, 464, 463, 463, 463, 463, 462, 462, 462, 462, 462 మార్కులు పొందారు. ఈ ఘన విజయాలు సాధించిన విద్యార్థులను శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డైరెక్టర్‌ మాదల సూర్యశేఖర్‌ అభినందించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement