అక్రమాల పేరుతో రెండేళ్లు రిజిస్ట్రేషన్లు ఆపేసిన చంద్రబాబు సర్కారు
చివరకు 9.09 లక్షల ఎకరాలు చట్ట ప్రకారమేనని తాజాగా జీవో జారీ
2023లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పించిన వైఎస్ జగన్ ప్రభుత్వం..ఎన్నికలయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసిన వైనం
చంద్రబాబు రాగానే 2024 ఆగస్టు నుంచి ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్.. రెండేళ్లలో 15సార్లు ఆంక్షల్ని పొడిగించి మరీ కక్షసాధింపు
వెరిఫికేషన్లు, ఉపసంఘంతో లెక్కలేనంత హడావుడి
చివరకు అంతా సక్రమమేనని తేల్చిన చంద్రబాబు ప్రభుత్వం
2.87 లక్షల ఎకరాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని వెల్లడి
ఈమాత్రం దానికి రెండేళ్లు ఆ భూములపై ఆంక్షలు ఎందుకు విధించారు?
వైఎస్ జగన్ హయాంలో మేలు జరగడమే లక్షలాది రైతులు చేసిన పాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 9.09 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ (హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భూములు సక్రమమేనని ఎట్టకేలకు అంగీకరించింది. రెవెన్యూ శాఖ మంగళవారం జారీ చేసిన జీవో–588తో ఈ విషయం స్పష్టమైంది. రెండేళ్లు ఆ భూములను అన్యాయంగా నిలుపుదల (అబయెన్స్) చేసినట్టు తేలింది. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై వారికే పూర్తి హక్కులు కల్పించి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల నాటికి 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసింది. బాబు ప్రభుత్వం వచ్చాక మిగిలిన అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేయకపోగా అప్పటికే ఫ్రీహోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. రాజకీయ దురుద్ధేశంతో అక్రమాలు జరిగాయని ఇన్నాళ్లూ అబయెన్స్లో పెట్టడంతో 20 లక్షల మంది రైతులు కష్టాలు పడుతున్నారు. తాజాగా ఇప్పుడా భూముల్లో అత్యధిక భాగం చట్టప్రకారమే ఫ్రీహోల్డ్ అయ్యాయని బాబు ప్రభుత్వమే తేల్చింది.
రెండేళ్ల హడావుడి.. తేలింది శూన్యం
అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన వ్యవసాయ భూములపై, 10 ఏళ్లు పూర్తయిన ఇళ్ల స్థలాలపై వాటిని పొందిన వారు లేకపోతే వారి వారసులకు పూర్తి హక్కులు కల్పిస్తూ 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం యాక్ట్ నం.35 వచ్చింది. ఫలితంగా 27 లక్షల ఎకరాలకు హక్కులు పొందే అవకాశం కలగ్గా.. ఎన్నికలయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమాల పేరుతో 2024 ఆగస్టు 10న ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. పరిశీలన పేరుతో ఆ నిలిపివేతను 15సార్లు పొడిగించింది.
2025 మార్చిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా.. ఆ సంఘం సిఫార్సులు ఇవ్వడానికి 18 నెలలు పట్టింది. ఇప్పుడు అదే ఉపసంఘం సిఫారసు మేరకు తాజాగా రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. 7.85 లక్షల ఎకరాలు నిబంధనల ప్రకారం కచ్చితంగా ఫ్రీహోల్డ్ అయ్యాయని జీవోలో ప్రభుత్వమే అంగీకరించింది. వాటితోపాటు ప్రైవేటు పట్టా భూములు, ప్రొసీడింగ్స్ రాని అర్హత గల భూములు, చుక్కల భూములు,ఇతర కేటగిరీలన్నీ కలిపి 9.09 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్లకు అనుమతిచ్చింది. సక్రమమే అయినప్పుడు రెండేళ్లపాటు ఆ భూముల రిజిస్ట్రేషన్లను గంపగుత్తగా ఎందుకు నిలిపివేశారనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఇంకా పరిశీలనలోనే 2.87 లక్షల ఎకరాలు
మిగిలిన భూముల్లో 2.87 లక్షల ఎకరాల భూములను ఇంకా పరిశీలిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. వెబ్ల్యాండ్లో అసైన్డ్ భూములుగా నమోదైనా అదనపు ఆధారాలు అందుబాటులో లేవనే కారణంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. 38,733 ఎకరాల్లో ఉల్లంఘనలు జరిగాయని, భూమి స్వా«దీనంలో లేదనే కారణంతో 25,486 ఎకరాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన 8,483 ఎకరాలపై ఆంక్షలు ఉంచారు. దీంతో మొత్తం 3.60 లక్షల ఎకరాలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఫ్రీహోల్డ్ హక్కులిచ్చే అధికారాలను ఆర్డీవో/సబ్ కలెక్టర్ అప్పగించినట్టు జీవోలో పేర్కొన్నా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని భూములపై మాత్రం ప్రభుత్వానికే అధికారం ఉంటుందని తెలిపింది.
‘వెబ్ఆప్షన్’ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2026–27 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్కు వెబ్ఆప్షన్ల నమోదు నోటిఫికేషన్ను మంగళవారం హెల్త్ వర్సిటీ జారీ చేసింది. విద్యార్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల్లోపు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 21న సీట్ల కేటాయింపు చేపట్టనుంది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707 నంబర్ను సంప్రదించాలని సూచించింది.
ధ్రువపత్రాల అప్లోడ్ను 17లోపు పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఎన్ఆర్ఐ కోటా ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటల్లోపు సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని హెల్త్ వర్సిటీ పేర్కొంది. గతంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సైతం ఈ గడువులోపు రూ.11 వేలు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల అప్లోడ్ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. 17న సాయంత్రం 5 నుంచి 18న మధ్యాహ్నం 3 వరకు రూ.31 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.


