మూడో ఏడాదీ మోసమే! | First installment of investment support for the third year to be credited tomorrow | Sakshi
Sakshi News home page

మూడో ఏడాదీ మోసమే!

Jun 19 2026 4:32 AM | Updated on Jun 19 2026 4:32 AM

First installment of investment support for the third year to be credited tomorrow

ఈసారి కూడా అరకొరగానే అన్నదాత సుఖీభవ

తొలి ఏడాది రూ.20 వేలు ఎగ్గొట్టి రెండో ఏడాది అరకొరగా విదిలింపు

రేపు మూడో ఏడాది తొలి విడత పెట్టుబడి సాయం జమ

ఈ ఏడాది కూడా 46.86 లక్షల మంది రైతులకే..!

మళ్లీ 7 లక్షల మందికి ఎగనామం పెడుతున్న చంద్రబాబు

రెండేళ్లలో భూ యజమానులకు రూ.14,873.28 కోట్లు ఎగవేత

కౌలు రైతులకు రెండేళ్లలో రూ.6,400 కోట్లు ఎగనామం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. 

తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు.

2023–24లో అర్హత పొందిన 53,58,366 మంది రైతులకు రూ. 20 వేల చొప్పున రూ.10,717 కోట్లు అవసరం కాగా 2024–25లో చంద్రబాబు తొలి బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.1,000 కోట్లు విదిల్చారు. ఒక్క రైతుకూ పైసా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ తొలి ఏడాది గడిపేసి, రైతులకు రూ.10,717 కోట్ల పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఆ ఏడాది బకాయిలతో కలిపి మరుసటి ఏడాది (2025–26) బడ్జెట్‌లో రూ.21,433.46 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టారు. 

రకరకాల సాకులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోతలు వేసి, లబ్ధిదారులను 46.86 లక్షల మందికి కుదించి, దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు. పాత బకాయిలతో కలిపి ఏకంగా రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. వాస్తవానికి ఏటా భూ యజమానుల సంఖ్య పెరుగుతుంది. కానీ గతేడాది అర్హత పొందిన లబ్ధిదారులకే ఈ ఏడాది కూడా పెట్టుబడి సాయం జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఆ లెక్కన 46.86 లక్షల మందికి తొలి విడతగా అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేలు కలిపి రూ.7 వేల చొప్పున శనివారం జమ చేయనున్నారు. లబ్ధిదారుల్లో 45,09,817 మంది భూ యజమానులు కాగా, 1,16,021 మంది అటవీ భూ సాగుదారులున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు జమ చేయనుండగా, పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.782.55 కోట్లు జమ చేయనుంది.

కౌలు రైతులకు పైసా ఇవ్వని బాబు
మరొక వైపు భూ యజమానులతో పాటు సామాజికవర్గాలతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు, దేవదాయ ధర్మాదాయ భూ సాగుదారులందరికీ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. వరుసగా మూడో ఏడాది కూడా కౌలురైతులకు మొండిచేయి చూపింది.  కానీ ఇప్పటివరకు పైసా విదల్చలేదు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. వారిలో సెంటు భూమి కూడా లేని వారు 10 లక్షల పైమాటే. 

2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని రెండో ఏడాది భూ యజమానులతో కలిపి సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకైనా ఇస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ తొలి విడత సాయం జమ సందర్భంగా ఖరీఫ్‌–2025 సీజన్‌లో పంట నమోదు (ఈ – క్రాప్‌) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రకటించారు. 

రెండో విడత సాయం పంపిణీ వేళ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చివరికి 2025–26 వ్యవసాయ సీజన్‌లో పైసా కూడా కౌలు రైతులకు విదిల్చిన పాపానపోలేదు. ఇలా కౌలు రైతులకు రెండేళ్లలో రూ.6400 కోట్ల మేర పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. కనీసం 2026–27 సీజన్‌లోనైనా కరుణ చూపుతారని ఆశించిన వారి ఆశలపై నీళ్లు జల్లింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement