రీల్స్ చూస్తూ విధులు నిర్వహిస్తున్న అధికారి
ప్రశ్నించినందుకు ప్రయాణికుడిపై దురుసు ప్రవర్తన
చిత్తూరు కార్పొరేషన్: టికెట్ రిజర్వేషన్ కోసం వచ్చిన ప్రయాణికుడికి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ప్రశ్నించిన ప్రయాణికుడిపై మహిళా రైల్వే అధికారి దాడి చేసిన ఘటన చిత్తూరు రైల్వే స్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం 8.45 గంటలకు చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లె పంచాయతీకి చెందిన ఓ ప్రయాణికుడు చిత్తూరు రైల్వేస్టేషన్కు శేషాద్రి ఎక్స్ప్రెస్లో గుడివాడకు వెళ్లడానికి టికెటు రిజర్వ్ చేసుకోవడానికి వచ్చాడు.
ఆ సమయంలో టికెటు కౌంటర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న రిజర్వేషన్ సూపర్వైజర్ జ్యోతిని సమాచారం అడగ్గా కాసేపు వేచి ఉండాలని చెప్పారు. 45 నిమిషాలు వేచి చూసిన ప్రయాణికుడు రైల్వే అధికారి రీల్స్ చూస్తూ కాలయాపన చేస్తుండటంతో ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె కౌంటర్ నుంచి బయటకు వచ్చి నానా దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని ప్రయాణికుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియో ఆధారాలను, ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ కమర్షియల్ కంట్రోలర్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


