ధాన్యం కొనాల్సిందే | Farmer Protest: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనాల్సిందే

May 4 2025 5:39 AM | Updated on May 4 2025 5:39 AM

Farmer Protest: Andhra Pradesh

అల్లూరి సీతారామరాజు జిల్లా పాపంపేట కూడలిలో ఆందోళన చేస్తున్న రైతులు

కొనుగోళ్ల నిలిపివేతను నిరసిస్తూ పలుచోట్ల రైతుల ధర్నా

ఏలూరులో కలెక్టరేట్‌ ముందు బైఠాయింపు 

భీమవరంలో నిరసన.. జేసీకి వినతిపత్రం 

అల్లూరి సీతారామరాజు జిల్లా పాపంపేట కూడలిలో ఆందోళన.. నిలిచిన ట్రాఫిక్‌  

తూర్పు గోదావరి జిల్లా పసలపూడి రైతు సేవా కేంద్రానికి తాళం 

ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిక   

ఏలూరు (టూటౌన్‌)/భీమవరం/అడ్డతీగల/ఉండ్రాజవరం: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడంపై రైతులు మండిపడ్డారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గింజనూ కొంటామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి జిల్లాల్లో రైతులు శనివారం రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌ ముందు మండుటెండలో బైఠాయించి రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. లక్ష్యం పెంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతుల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ లక్ష్యం పూర్తయ్యిందంటూ ప్రభుత్వం రబీ ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడం దారుణమని విమర్శించారు. దిగుబడిలో సగం మేర కూడా కొనుగోలు చేయక పోవడం అన్యాయమన్నారు. కొన్నిచోట్ల లారీలు, ట్రాక్టర్లలోకి లోడు చేసిన ధాన్యం మూడు రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఉండిపోయిందని చెప్పారు.

ఏలూరు, వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద లారీ, ట్రాక్టర్‌లోకి లోడు చేసిన ధాన్యం కొనుగోలు నిలిచి పోవడంతో బైరెడ్డి లక్ష్మణరావు అనే రైతు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు తదితర మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అనంతరం పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పి.శివరామమూర్తికి రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు వినతిపత్రం అందజేశారు.  

దళారుల ప్రమేయం వల్లే ఇబ్బందులు
ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని అరికట్టి, ప్రభుత్వమే కొనాలని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదు­నూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారు­మూ­రి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా­లో 2.20 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా, దాదాపు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, ప్రభుత్వం కేవలం 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించడం దారుణం అన్నా­రు.

తేమ, నూక సాకు­తో  దళారులు, మిల్ల­ర్లు తక్కువ ధరకు కొనుగో­లు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల రైతు బస్తాకు దాదాపు రూ.400 వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశా­రు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభు­త్వమే «పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. పార్టీ ఉండి, పాలకొల్లు నియోజకవర్గ సమ­న్వ­యకర్తలు పీవీఎల్‌ నర్సింహరాజు, గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రం ఏర్పాటులో ఇంత తాత్సారమా?
రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో వరి రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం వీరంతా పాపంపేట వద్ద మూడు రోడ్ల కూడలిలో బైఠాయించి ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం తెరవడంలో తాత్సారం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి పోవడం వల్ల నష్టపోతున్నామన్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి రైతులు శనివారం తాళాలు వేసి నిరసన తెలిపారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎవరు కొంటారని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement