టెన్త్‌ విద్యార్థుల వివరాల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌ | Edit option to edit the details of Tenth students Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థుల వివరాల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌

Jan 11 2023 4:59 AM | Updated on Jan 11 2023 4:59 AM

Edit option to edit the details of Tenth students Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి ధ్రువపత్రాల్లో తలెత్తే లోపాలు విద్యార్థులకు ఆ తరువాతి కాలంలో పెద్ద సమస్యగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి. చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్‌ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్‌ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.

ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్‌ పరీక్షలకు హాజ­రయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపా­ట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌­ను అందుబాటులోకి తెచ్చామని ప్రభు­త్వ ప­రీ­క్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలి­పారు. స్కూల్‌ లాగిన్‌ నుంచి ఈ ఎడిట్‌ ఆప్ష­న్‌ విని­యోగించి నామినల్‌ రోల్స్‌లోని వివరాల­ను సరి­చేసుకోవాలని సూచించారు. బుధవారం (నేడు) నుంచి ఈనెల 20వ తేదీవరకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలో­గా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు. 

సరిచూసుకోవలసిన అంశాలు
► విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు
► పుట్టిన తేదీ
► విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్‌ కాంబినేషన్‌
► విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం
► ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్‌
► వొకేషనల్‌ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్‌
► విద్యార్థి ఐడెంటిఫికేషన్‌ చిహ్నాలు (పుట్టుమచ్చలు)
► విద్యార్థి ఫొటో, సంతకం

Advertisement
 
Advertisement
Advertisement