
సాక్షి, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో ‘రప్పా.. రప్పా’ డైలాగ్ రాజకీయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘పుష్ప–2’ సినిమాలోని డైలాగ్ ‘రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్ ప్రదర్శించిన విషయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం రాజేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు చివరకు ఆ పోస్టర్ ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని తేలడంతో కంగుతున్నారు.
దీంతో, ఈ విషయంలో కూటమికి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనే దానిపై మాట్లాడుకున్నారు. కొందరు మంత్రులు చంద్రబాబు మెప్పు కోసం ఈ విషయంలో వైఎస్ జగన్కే నష్టం జరిగిందని, వారికి బాగా డ్యామేజ్ అయిందనే రీతిలో మాట్లాడినట్టు సమాచారం. భిన్నాభిప్రాయంతో ఉన్న మరికొందరు బయటకు వచ్చాక రియాలిటీగా మాట్లాడితే బాగుంటుందని అన్నట్టు తెలిసింది. అలాగే జగన్ పర్యటనలో ఆయన కారుకింద పడి కార్యకర్త మృతి చెందిన వ్యవహారంపై ఒక మంత్రి ప్రస్తావించగా.. చంద్రబాబు స్పందిస్తూ చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు.
పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడకూడదని, తెలంగాణకు జవాబిచ్చే రీతిలో ఉండాలని, అదే సమయంలో అక్కడి వారికి వ్యతిరేకంగానూ ఉండకూడదని చెప్పినట్టు సమాచారం. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు చెప్పాలని సూచించారు. కాగా, మంత్రివర్గ సమావేశం మొదలుకాగానే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి కూర్చున్న ఆయన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సీఎంకు చెప్పి వెళ్లిపోయారు.
